‘కదనభేరి’ని విజయవంతం చేయండి..
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:54 AM
ఎస్సారార్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కదనభేరి బహిరంగ కార్యకర్తలు, పార్టీశ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు.
కరీంనగర్ టౌన్, మార్చి 7: ఎస్సారార్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కదనభేరి బహిరంగ కార్యకర్తలు, పార్టీశ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. కదనభేరి సభ సన్నాహక సమావేశం కరీంనగర్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ నియోజకవర్గాని చేసిందేమి లేదన్నారు. దమ్ముంటే కరీంనగర్ కమాన్ వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. శివలింగంపై తేలులాగా రాముడి ఫొటో అడ్డంపెట్టుకుని నీచమైన మాటలలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్నుద్దేశించి నీవు నీతల్లికే పుట్టావని రుజువు ఏమిటని మాట్లాడి మహిళలను అవమానపరిచినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మన కోసం గర్జించే, పార్లమెంట్లో కరీంనగర్ వాణిని వినిపించేందుకు వినోద్కుమార్ను గెలిపించాలని కోరారు. వినోద్కుమార్ను ఎంపీగా గెలిపిస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటామని బీఆర్ఎస్ నేతలకు హామీ ఇచ్చారు. బీజేపీకీ, బీఆర్ఎస్ బీటీం కాదని, బీటీం అయితే కవితపై ఎందుకు కేసులు పెట్టి ఇబ్బంది పెడతారని ఆలోచించాలని పార్టీశ్రేణులకు సూచించారు. కరీంనగర్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీకి, బండి సంజయ్కి వేసినట్లేనని అన్నారు.
బీఆర్ఎస్ కరీంనగర్ లోక్సభ అభ్యరి,్థ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ ఈనెల 12న నిర్వహించనున్న కరీంనగర్ కదనభేరి బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చి విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్లు మాట్లాడే మాటలు దేశసమైక్యతకు దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. ఒక్క రోజైనా పార్లమెంట్లో ప్రజా సమస్యలపై కానీ, నియోజకవర్గ అభివృద్ధిపైగానీ, తెలంగాణపైగానీ రెండు నిమిషాలు మాట్లాడని నాయకుడు ఎంపీగా ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. కేసీఆర్ను ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అని వచ్చిరాని భాషతో మాట్లాడిన సంజయ్ మనకు ఎంపీగా అవసరమా ప్రజలు, శ్రేణులు ఆలోచించాలని కోరారు. యూపీలో భద్రి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించారని, తెలంగాణాకు చెందిన నలుగురు బీజేపీ, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే ఐఐఐటీ కరీంనగర్కు తీసుకువచ్చేవాడినని, ఈ విషయంపై ప్రజల్లో చర్చ పెట్టాలని పారీ ్టశ్రేణులను కోరారు. అభివృద్ధిపై సంజయ్కి ఆలోచనలేదని, ధర్మం, మతం అంటూ ప్రవచనాలు చెప్పే సంజయ్ ఓ మఠం, ఆశ్రమం పెట్టుకోవాలని సూచించారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఒక్క మండలానికి కూడా వెళ్లలేదని, తాను ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో తిరిగినట్లు సంజయ్ తిరుగలేదని అన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉండగా కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సాగునీరు కరెంటు నిచ్చారని, ఎన్ని విపత్తులు వచ్చినా వాటిని ఎదుర్కొని రైతులకు అండగా నిలిచారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే రైతులు కరెంటు లేక, సాగునీరు లేక పంటలు ఎండిపోయి అయోమయానికి గురవుతున్నారని, వారికి అండగా నిలిచి పోరాడుదామని అన్నారు. 12న జరిగే కరీంనగర్ కదనభేరి సభను విజయవంతంచేసి ఎంపీగా వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ పోలీసులు తప్పుడు కేసులు పెడితే అధికారంలోకి రాగానే మిత్తితో సహా తీసుకుంటామని, జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. రెండు లక్షల మెజార్టీతో వినోద్కుమార్ ఎంపీగా గెలువడం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితెల సతీష్కుమార్, సుంకె రవిశంకర్, వి మోహన్రెడ్డి, నాయకులు చల్మెడ లక్ష్మీనర్సింహారావు, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, హన్మకొండ జడ్పీ చైర్పర్సన్లు కనుమల్ల విజయ, దావ వసంత, అరుణ రాఘవరెడ్డి, డాక్టర్ సుధీర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అధ్యక్షుడు తోట ఆగయ్య, కలువకుంట్ల విద్యాసాగర్రావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, నారదాసు లక్ష్మణ్రావు, మేయర్ యాదగిరి సునీల్రావు, సర్దార్ రవీందర్సింగ్, గెల్లు శ్రీనివాస్, అనిల్కుర్మాచలం, బండ శ్రీనివాస్, లోక బాపురెడ్డి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిహరిశంకర్, కర్ర శ్రీహరి, జమీలొద్దీన్, గూడూరి ప్రవీణ్, రూప్సింగ్ పాల్గొన్నారు.