టెక్స్టైల్ మూసివేతపై కేటీఆర్ సమాధానం చెప్పాలి
ABN , Publish Date - Jan 14 , 2024 | 12:33 AM
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను అన్ని రకాలుగా ఆదుకున్నామని గొప్పలు చెప్పిన కేటీఆర్ టెక్స్టైల్ ఎందుకు మూతపడిందో సమాధానం చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం డిమాండ్ చేశారు.
![టెక్స్టైల్ మూసివేతపై కేటీఆర్ సమాధానం చెప్పాలి](https://media.andhrajyothy.com/media/2023/20231205/3_98f7514c1a.jpg)
సిరిసిల్ల టౌన్, జనవరి 13 : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను అన్ని రకాలుగా ఆదుకున్నామని గొప్పలు చెప్పిన కేటీఆర్ టెక్స్టైల్ ఎందుకు మూతపడిందో సమాధానం చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం డిమాండ్ చేశారు. శనివారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావడం కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనే ఆరాచకాలు, ఇసుక, లాండ్ మాఫీయా, దోపిడీలు జరిగాయని ఆరోపించారు. ఒక్కనెలలో దాదాపు రూ. 140 కోట్ల విలువ చేసి ఇసుకను అక్రమంగా జిల్లా నుంచి తరలించారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా ఉపయోగించుకున్నారన్నారు. దీనిపై విచారణ జరపడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిద్ధమయ్యారన్నారు. జిల్లాలో అనుమతులు లేకుండా స్టోన్క్రషర్లు నడుస్తున్నాయన్నారు. అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, ప్రధాన కార్యదర్శి కల్లూరి చందన, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు ఎండీ అహ్మద్, నాయకులు వైద్య శివప్రసాద్, మేకల కమలాకర్, వనితగౌడ్, కంసాల మల్లేశం, అశోక్, కార్యకర్తలు పాల్గొన్నారు.