సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:30 AM
సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి గురువారం నాడు హైదరాబాద్లోని సచివాలయంలో గల తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు.

- మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
వేములవాడ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి గురువారం నాడు హైదరాబాద్లోని సచివాలయంలో గల తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతి పై అధికారులతో చర్చించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్ టూ ఫేస్ వన్ పనులు వేగవంతం చేయాలని, మర్రిపల్లి రిజర్వాయర్, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ పనుల్లో వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు, సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. ఇటీవల బడ్జెట్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 325 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. రుద్రంగి, నాగారం చెరువు కాల్వపై రైతుల సౌకర్యార్థం బ్రిడ్జిల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలన్నారు. కోనరావుపేట మండలంలోని లచ్చంపేట చెరువును రిజర్వాయర్గా మార్చే ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. స్టేజ్ టూ ఫేస్ టూలో భాగంగా కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ కుడి ఎడమ కాల్వలకు సంబంధించి భూ సేకరణ వెంటనే చేపట్టి కాలువ పనులను ప్రారంభించవలసిందిగా ఆదేశించారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి ఎగువ మానేరు ప్యాకేజ్-9 పనుల్లో వేగవంతం చేయాలని, మల్కపేట రిజర్వాయర్ లో రైతులకు సరిపడా నీటిని నింపాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు సాగునీటి ప్రాజెక్టులను సందర్శించి పనుల్లో పురోగతిని తెలుసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా వేములవాడ నియోజకవర్గం లోని పలు ప్రాజెక్టులను త్వరలో సందర్శిస్తానని నీటిపారుదల శాఖ మంత్రి వెల్లడించారు.