‘ఆసరా’ పింఛన్లలో అక్రమాలు
ABN , Publish Date - Jul 19 , 2024 | 12:34 AM
నిరుపేద కుటుంబాలకు జీవనం సాగించే క్రమంలో కాస్తా చేయూతగా నిలవాలని, దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు పింఛన్లు అందిస్తోంది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
నిరుపేద కుటుంబాలకు జీవనం సాగించే క్రమంలో కాస్తా చేయూతగా నిలవాలని, దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు పింఛన్లు అందిస్తోంది. గతంలో కొద్ది మొత్తంలోనే పింఛన్ అందించేవారు. గత ప్రభుత్వ హయాం నుంచి పింఛన్ డబ్బులు పెరగడంతో పింఛన్ పొందడానికి డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం ఆసరా పేరుతో వయోవృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడి కార్మికులు, బీడీ టేకేదార్లు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, వితంతువులు, హెచ్ఐవీ, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ వ్యాధిగ్రస్థులకు ఇలా 11 రకాలుగా ప్రభుత్వం చేయూత పథకం కింద పింఛన్లను అందిస్తోంది. సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు ప్రామాణికంగా ఉన్నా అసరా పథకానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆసరా పింఛన్లు రెండు రకాలుగా అందుకుంటున్న వారు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పదవీవిరమణ పొందిన తరువాత పెన్షన్తో పాటు ఆసరా పెన్షన్లు కూడా పొందుతున్న వారు ఉన్నారు. ఈ క్రమంలోనే 2018 వరకు రేషన్ కార్డు అర్హత ఉండగా తరువాత దశల వారీగా ఆధార్ లింక్ చేయడంతో రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఆసరా పింఛన్లలో దాగిన అక్రమాలు బయటపడుతున్నాయి. జిల్లాలో తాజాగా 71 మంది డబుల్ పింఛన్లు, ఉద్యోగ విరమణ తరువాత రెండు పింఛన్లు పొందుతున్న వివరాలు బయటపడ్డాయి.
జిల్లాలో రూ. 63 లక్షల రికవరీకి సిద్ధం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆధార్ లింక్తో భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగానే భార్యకు పింఛన్ పొందడం, భర్త మరణించిన తర్వాత భర్తకు సంబంధించిన పింఛన్తో పాటు ఆసరా పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగంలో కుటుంబసభ్యులు ఉన్నా ఇంట్లో తల్లిదండ్రులు పెన్షన్ పొందడం వంటివి వెలుగు చూశాయి. ఆధార్ లింక్ ద్వారా అక్రమ పింఛన్లు రాష్ట్ర స్థాయిలో వెలికితీసి జిల్లాకు పంపించారు. జిల్లాలో 71 మంది నుంచి రూ. 63 లక్షల 10 వేల 136 పింఛన్ డబ్బులను రికవరీ చేసే దిశగా నోటీసులు సిద్ధం చేశారు. కొందరికి నోటీసులు కూడా జారీ చేసిన క్రమంలో నోటీసుల ప్రక్రియ నిలిపివేస్తూ సీఎస్ శాంతికుమారి అధికారులకు సూచనలు చేయడంతో నిలిచిపోయింది. రికవరీ కేవలం ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చే వరకు మాత్రమే ఉంటుందని తెలిసింది. అసెంబ్లీ సమావేశాల్లో అక్రమ పింఛన్లపై నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో కూడా ఆసరా పింఛన్లలో అనేక అక్రమాలు బయటపడ్డాయి. ప్రధానంగా బీడి కార్మికుల పింఛన్లలో అవకతవకలు వెలుగు చూశాయి. సిరిసిల్ల మున్సిపాలిటీల్లోనే 200 మంది ఖాతాల్లో అక్రమంగా డబ్బులు పడుతున్న విషయాన్ని గుర్తించారు. కొందరికి బీడి పింఛన్ వస్తున్నట్లు ప్రొసీడింగ్లు ఉన్నా డబ్బులు రానీ పరిస్థితి ఉంటే ప్రొసీడింగ్లు లేకుండానే వేరే వారి ఖాతాల్లో డబ్బులు జమ అయిన సందర్భాలు ఉన్నాయి. వివిధ మండలాల్లో బీడి కార్మిక పింఛన్, ఇంటింటి సర్వేతో అక్రమాలు వెలుగు చూశాయి. పింఛన్ డబ్బులను మళ్లీ రికవరీ చేశారు.
జిల్లాలో 1.19 లక్షల పెన్షన్లు...
జిల్లాలో లక్షా 19 వేల 602 ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వృద్ధాప్య ఫించన్లు 32,753 మంది, దివ్యాంగులు 9,943 మంది, వితంతువులు 24,298 మంది, చేనేత కార్మికులు 3,639 మంది, గీతా కార్మికులు 2,306 మంది, ఒంటరి మహిళలు 1,823 మంది, బీడికార్మికులు 43,328 మంది, పైలేరియా బాధితులు 975 మంది, డయాలసిస్ వ్యాధిగ్రస్థులు 66 మంది, బీడి టేకేదార్లు 471 మంది ఉన్నారు. జిల్లాలో మండలాల వారీగా పింఛన్ దారుల్లో బోయినపల్లి 6,908 మంది, చందుర్తి 7,119 మంది, ఇల్లంతకుంటలో 8,464 మంది, గంభీరావుపేటలో 11,554 మంది, కోనరావుపేటలో 9,404 మంది, ముస్తాబాద్లో 10,762 మంది, రుద్రంగిలో 2,925 మంది, సిరిసిల్ల మున్సిపాలిటీల్లో 21,988 మంది, తంగళ్లపల్లిలో 10,781 మంది, వీర్నపల్లిలో 2,149 మంది, వేములవాడలో 3,395 మంది, వేములవాడ రూరల్లో 5,520 మంది, వేములవాడ మున్సిపాలిటీలో 7,306 మంది, ఎల్లారెడ్డిపేట లో 11,327 మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ 26 కోట్ల 21 లక్షల 10 వేల 560 పింఛన్ను అందిస్తున్నారు.