ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలి
ABN , Publish Date - Apr 14 , 2024 | 12:25 AM
పెండింగ్లో ఉన్న ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లతోపాటు సంక్షేమ రంగానికి సంబంధించిన మెస్ బిల్లుతోపాటు డైట్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ డిమాండ్ చేశారు.
![ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలి](https://media.andhrajyothy.com/media/2024/20240413/1_3c9ec0af06.jpg)
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 13: పెండింగ్లో ఉన్న ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లతోపాటు సంక్షేమ రంగానికి సంబంధించిన మెస్ బిల్లుతోపాటు డైట్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ఓ డిగ్రీకళాశాలలో భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాజన్న సిరిసిల్ల జిల్లా మూడో మహాసభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జెండాను జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽఽధిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ విద్యార్ధులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లతోపాటు ఫీజురీయింబర్స్మెంట్లను విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్లకు సంబంధించిన డైట్ చార్జీలు విడుదల చేయకపోవడం సరికాదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ చార్జీలను మూడువేల రూపాయలకు పెంచాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోతే సమస్యలపై ఏవిధంగా చర్చిస్తారన్నారు. పెండింగ్లో ఉన్న 7,800కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్ధలను రద్దు చేయడంతోపాటు ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వచ్చే విద్యాసంవత్సరం నుంచైనా మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలన్నారు. అద్దెభవనాల్లో నడుస్తున్న హాస్టల్లు, గురుకులాలు, కేజీవీబీలకు పక్క భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు మనోజ్, రాకేష్, సహాయ కార్యదర్శి కళ్యాణ్, అనూష తదితరులు పాల్గొన్నారు.