Share News

వేములవాడ ఆలయ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:40 AM

వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి భక్తుడిగా చెబుతున్నానని, మాటల్లో కాకుండా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

వేములవాడ ఆలయ అభివృద్ధికి కృషి
రాజన్నకు పట్టు వస్ర్తాలు తీసుకెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

- మంత్రి పొన్నం ప్రభాకర్‌

సిరిసిల్ల, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి భక్తుడిగా చెబుతున్నానని, మాటల్లో కాకుండా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలను సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల అమలు జరిపే శక్తిని ఇవ్వాలని మహాశివరాత్రి సందర్భంగా శివుడిని వేడుకున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ప్రభుత్వాలు ఏవి ఉన్నా, మేము అధికార పక్షంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా సర్వేజన సుఖినో భవంత్‌.. అందరూ సుఖః సంతోషాలతో వర్థిల్లేలా చూడాలని అన్నారు. స్వయంగా మహా శివరాత్రి జాతరకు ముఖ్యమంత్రి రావాల్సి ఉండేదని, ఢిల్లీలో సమావేశాలతో రాలేకపోయారని అన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి రాకపోతే వారం రోజుల్లో వేములవాడను సందర్శించి రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని కేటీఆర్‌ మాట్లాడిన మాటలపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు పొన్నం సమాధానం చెబుతూ దేవాలయంలో ఉన్నామని, ‘ఓం నమఃశివాయ’ విలువ నాస్తికులకు ఏం తెలుస్తుందని అన్నారు. మేము గెలిచి వంద రోజులు కాలేదని, డిసెంబరు వర్షకాలం కాదని, అప్పటికే నీరును సముద్రంలోకి వదిలింది ఎవరని సమాధానమిచ్చారు.

Updated Date - Mar 08 , 2024 | 12:40 AM