Share News

చెదురుతున్న రంగులు

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:27 AM

సిరిసిల్ల అనగానే అందరికి గుర్తుకు వచ్చేది మరమగ్గాల చప్పుళ్లు.. వాటికి అనుబంధంగా ఉండే రంగు రంగుల అద్దకం పరిశ్రమ.

చెదురుతున్న రంగులు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సిరిసిల్ల అనగానే అందరికి గుర్తుకు వచ్చేది మరమగ్గాల చప్పుళ్లు.. వాటికి అనుబంధంగా ఉండే రంగు రంగుల అద్దకం పరిశ్రమ. దక్షిణాది రాష్ట్రాలకు పెటీకోట్స్‌ బట్ట అందిస్తున్న సిరిసిల్ల కాటన్‌ అద్దకం పరిశ్రమ రంగులు చెదిరిపోతున్నాయి. దీంతో కార్మికులకు ఉపాధిని దూరం అవుతోంది. తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లోని పరిశ్రమలతో తీవ్ర పోటీని ఎదుర్కొని నిలబడే ప్రయత్నం చేస్తున్నా రంగులు, రసాయనాల ధరలు పెరిగిపోవడంతో అద్దకం కూలి గిట్టుబాటు కాని పరిస్థితులు నెలకొన్నాయి. బతుకమ్మ చీరలతో పాటు పెటీకోట్స్‌ ఇవ్వాలని అద్దకం పరిశ్రమ యజమాన్యం, కార్మికులు కోరుతున్నా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడంతో అనేక పరిశ్రమలు మూత పడ్డాయి.

దక్షిణాది రాష్ట్రాలకు రంగుల బట్ట

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతో ఎత్తుకు ఎదుగుతూ మరమగ్గాలు, అనుబంధ పరిశ్రమల వైపు అడుగులు వేసింది. మరమగ్గాలపై కాటన్‌ వస్త్రాలు ఉత్పత్తి అయితే వాటికి రంగులు అద్ది దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ అగ్రగామిగా నిలిచింది. చిన్న చిన్న యంత్రాలతో కుటీర పరిశ్రమగా రంగుల ప్రపంచంలో ఎంతో మందికి ఉపాధి లభించింది. ఆధునిక యంత్రాలు, మిల్లు బట్ట నుంచి ఎదురైన పోటీతో పరిస్థితులు తలకిందులయ్యాయి. మరమగ్గాలకు అనుబంధంగా ఉన్న అద్దకం పరిశ్రమ కష్టాల్లో పడింది. సిరిసిల్లలో 37 వేల మరమగ్గాలు ఉంటే అందులో 15 వేలకు పైగా మరమగ్గాలపై కాటన్‌ బట్ట ఉత్పత్తి జరిగేది. మిగతా మరమగ్గాలపై పాలిస్టర్‌ బట్ట ఉత్పత్తి అయ్యేది. కాటన్‌ ఉత్పత్తికి అనుబంధంగా 28 సైజింగ్‌లు, 300కు పైగా డైయింగ్‌ యూనిట్లు పనిచేసేవి. తమిళనాడు, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఆధునిక డైయింగ్‌ యంత్రాలు ఉపయోగించడంతో సిరిసిల్ల అద్దకం పరిశ్రమకు తీవ్ర పోటీ ఏర్పడింది. మరమగ్గాల పరిశ్రమలో తరచూ తలెత్తే సంక్షోభం పాలిస్టర్‌, కాటన్‌ వస్త్రోత్పత్తికి విఘాతం కలిగేవి. కార్మికుల ఆత్మహత్యలు పనులు లేక పరిశ్రమలు మూతపడేవి. దీంతో కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేసేవి. తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్ల కార్మికులకు చేతినిండా పని కల్పించాలనే లక్ష్యంగా బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు చీర కానుకగా అందించడానికి నిర్ణయించింది. 2017 నుంచి బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు అందించి ఉపాధి కల్పిస్తున్నారు. ఏటా కోటి చీరలు ఉత్పత్తి చేస్తున్నారు. మరమగ్గాలపై కాటన్‌ ఉత్పత్తి నిలిచిపోయి బతుకమ్మ చీరలు మొదలవడంతో అనుంబంధ పరిశ్రమలు సంక్షోభంలో చిక్కాయి.

డైయింగ్‌, సైజింగ్‌లకు మొదలైన కష్టాలు

సిరిసిల్లలో 37 వేల మరమగ్గాలు ఉండగా వీటిలో ఎక్కువ శాతం బతుకమ్మ చీరలు, ఇతర పాలిస్టర్‌ బట్ట ఉత్పత్తి మొదలైంది. బతుకమ్మ చీరల ఆర్డర్లతో కాటన్‌ బట్ట ఉత్పత్తి నిలిచిపోయింది. గతంలో దాదాపు 15 వేల మరమగ్గాలపై నడిచే కాటన్‌ ఉత్పత్తి ఇప్పుడు 800 మరమగ్గాలకు పడిపోయింది. కాటన్‌ ఉత్పత్తులకు అనుబంధంగా మొదలైన 28 సైజింగ్‌ల్లో 14 మూతపడ్డాయి. దీనికి తోడు కాటన్‌, రసాయనాల ధరలు కూడా పెరిగిపోయాయి. మార్కెట్‌లో బట్ట ఉత్పత్తికి ధర పెరగకపోవడంతో పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు 10 సైజింగ్‌లు నడుస్తున్నా నెలకు 15 రోజులు మాత్రమే కార్మికులకు పని దొరుకుతోంది. మరోవైపు 300 డైయింగ్‌ పరిశ్రమల్లో 270 వరకు మూతపడ్డాయి. 30 డైయింగ్‌లు నామమాత్రంగా అద్దకం జరుపుతున్నాయి. నెలలో కేవలం 2 వారాలు మాత్రమే కార్మికులకు పని ఉంటోంది. పూర్తి స్థాయిలో పని ఉంటే ఒక కార్మికుడు నెలకు రూ.15 వేల వరకు సంపాదించుకునే వారు. ప్రస్తుతం రూ.6 వేలకు మించి లభించడం లేదు. అద్దకం పనిలేని రోజు ఇతర పనులు చేసుకుంటున్నారు. గతంలో అద్దకం సైజింగ్‌ పరిశ్రమపై 5వేల మంది ఉపాధి పొందేవారు ప్రస్తుతం వారు ప్రత్యామ్నాయ వృత్తుల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వెయ్యి మంది వరకు పనులు చేస్తుండగా ఆ పనులు కూడా దొరకని పరిస్థితి. గతంలో సిరిసిల్ల డైయింగ్‌ పరిశ్రమ నుంచి రంగుల బట్ట దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోని తమిళనాడు, గుజరాత్‌లలో అద్దకం పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం రాజస్థాన్‌లోని బలహోత్రాలో ఆధునిక డైయింగ్‌ యూనిట్లు రావడం వాటికి అక్కడి ప్రభుత్వాల ప్రోత్సాహం ఉండడంతో సిరిసిల్ల అద్దకం పరిశ్రమ మూత పడే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలోని కొత్త ప్రభుత్వం వస్త్ర పరిశ్రమపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందననే కార్మికుల్లో ఆసక్తి నెలకొంది. అద్దకం పరిశ్రమకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:27 AM