సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం
ABN , Publish Date - Apr 02 , 2024 | 11:32 PM
కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు.
![సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం](https://media.andhrajyothy.com/media/2024/20240326/19251_af899b5f8b.jpg)
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 2: కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ అభిషేక్ మొహంతి మాట్లాడతూ మంగళవారం నుంచి సైబర్ క్రైమ్ స్టేషన్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎ్స్హెచ్ఓ)గా ఏసీపీ నర్సింహారెడ్డిని నియమించామన్నారు. బాధితులు నేరుగా వచ్చి వారి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు నేరం చేసే విధానాన్ని మార్చుతూ, ఖాతాల్లో ఉన్న డబ్బు దోచుకుంటారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని వ్యక్తులకు ఫోన్ల ద్వారా పాస్వర్డ్, ఓటీపీలు చెప్పవద్దని సూచించారు. ప్రలోభాలకు గురిచేసే లింక్లను క్లిక్ చేయడం వంటి విషయాల్లో జగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ క్రైమ్కు గురైన భాదితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. బాధితులు టోల్ఫ్రీ నంబర్ అయిన 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఫ సైబర్ వారియర్స్ టీం ఏర్పాటు
కమిషనరేట్ వ్యాప్తంగా ఉత్పన్నమయ్యే సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ వారియర్స్ టీంను ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. ప్రతీ పోలీస్ స్టేషన్లో టెక్నాలజీపై అవగాహన ఉన్న సిబ్బందిని గుర్తించి వారిని సైబర్ వారియర్గా నియమించామన్నారు. క్షేత్ర స్థాయిలో భాదితులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించేందుకుగాను వీరిని ఏర్పాటు చేశామన్నారు. వీరు సైబర్ నేరాల్లో ఆధారాలు సేకరించి నేరస్థులను పట్టుకుంటారని, వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.