కూడళ్లు.. ప్రమాదాల లోగిళ్లు
ABN , Publish Date - May 19 , 2024 | 12:04 AM
హుజూరాబాద్ పట్టణం నుంచి ఆయా గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదా రులపై ఉన్న కూడళ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఎక్కడో ఒకచోట తరచుగా ప్రమాదాలు జరుగుతుం డటంతో క్షతగాత్రుల, మృతుల కుటుంబాలు రోడ్డున పడి చిన్నాభిన్నమవుతున్నాయి.
![కూడళ్లు.. ప్రమాదాల లోగిళ్లు](https://media.andhrajyothy.com/media/2024/20240511/03_HZBRURAL_181_f45a3547b3.jpg)
హుజూరాబాద్రూరల్, మే 18: హుజూరాబాద్ పట్టణం నుంచి ఆయా గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదా రులపై ఉన్న కూడళ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఎక్కడో ఒకచోట తరచుగా ప్రమాదాలు జరుగుతుం డటంతో క్షతగాత్రుల, మృతుల కుటుంబాలు రోడ్డున పడి చిన్నాభిన్నమవుతున్నాయి.
ఫ ప్రాణం తీస్తున్న మూల మలుపులు
హుజూరాబాద్ మండలంలోని ఆయా గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల వెంబడి మూల మలుపులు ప్రమాదకరంగా మారాయి. కనుకులగిద్దె, జూపాక, ధర్మరాజుపల్లి, రంగాపూర్, రాంపూర్, సిర్సపల్లి, వెంకట్రావ్ పల్లె తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల వెంబండి మూల మలుపుల వద్ద పిచ్చి చెట్లు ఏపు పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదకరంగా మారాయి. అధికార యంత్రాంగం మూల మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కానరాక వాహన దారులు ప్రమాదాల భారిన పడుతున్నారు.
ఫ ప్రమాదాలకు నిలయంగా కూడళ్లు
హుజూరాబాద్ పట్టణం నుంచి జమ్మికుంట పట్టణానికి వెళ్లే దారిలో ఉన్న రంగాపూర్, రాంపూర్, చెల్పూర్, శాలపల్లి ఇందిరానగర్, ఇటు కరీంనగర్ జిల్లాకు వెళ్తున్న దారిలో తుమ్మన్నపల్లి, సింగాపూర్, ఎరుకుల గూడెం చౌరస్తా, ఇటు చిన్నపాపయ్యపల్లి, పెంచికల్పేట చౌరస్తా వరకు, పెద్దపాపయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కేసీ క్యాంపు చౌరస్తా, కందుగుల, ధర్మరాజుపల్లి చౌరస్తాల వరకు యూ టర్న్లు ప్రమాదకరంగా ఉన్నాయి. చౌరస్తాల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో పెద్ద వాహనాలను ద్విచక్ర వాహనదారులు ఢీకొని ప్రమాదాల బారినపడ్డారు. జమ్మికుంట రోడ్లోని రంగాపూర్, చెల్పూర్, శాలపల్లి- ఇందిరానగర్ గ్రామాల్లోని యూటర్న్ల వద్ద ద్విచక్ర వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించక రోడ్డుపైకి ఒకేసారి వస్తుండటంతో ప్రమాదాల బారిన పడుతుండగా, రోడ్డు ఎత్తువంపుల వద్ద ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి డివైడర్లను ఢీకొని మృత్యువాత పడుతున్నారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ప్రమాదకరమైన కూడళ్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
ఫ మూల మలుపులతో ఇబ్బందులు పడుతున్నాం
-మొలుగు శ్రీనివాస్, కనుకులగిద్దె
మా గ్రామం నుంచి పట్టణానికి రావాలంటే సుమారు పదికి పైగా మూల మలుపులు ఉన్నాయి. ఈ మూల మలుపుల వద్ద పిచ్చి చెట్లు ఏపుగా పెరిగి మూల మలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక పోవడంతో వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టుకుంటున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలి.
ఫ ఎత్తువంపుల రోడ్డుతో బండ్లు అదుపు తప్పుతున్నాయి
-గొసికొండ మృత్యుంజయ్, రాంపూర్
హుజూరాబాద్ పట్టణానికి వచ్చే సమయంలో హుజూరాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారి అక్కడక్కడ ఎత్తువంపులు ఉండటంతో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పుతున్నాయి. గత నెలలో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అధికారులు దృష్టి సారించి చర్యలు చేపట్టాలి.