Share News

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ‘బడిబాట’

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:41 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ‘బడిబాట’
కరీంనగర్‌ సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు,

- విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం

- పెద్ద ఎత్తున ర్యాలీలు, సమావేశాలు

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 6: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామపంచాయతీలో తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాల ఉండే విధంగా చర్యలు తీసుకొని పేద, మధ్య తరగతి తల్లిదండ్రులపై ఆర్థికభారం పడకుండా చూసేందుకు ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించింది. దీంతో పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ‘బడిబాట’ పట్టారు.

ఫ ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘మన ఊరు..మన బడి...మన బస్తీ’ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూడేళ్లలో కార్పొరేట్‌ హంగులతో తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టి ంది. గత ఏడాది జిల్లాలో 234 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి మిగిలిన అన్ని పాఠశాలలను కొత్త హంగులతో తీర్చిదిద్దుతోంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌, తెలుగు మీడియంలో విద్యాబోధనతోపాటు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులను అందించడంతోపాటు మధ్యాహ్న భోజనం అందజేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఒక జత షూస్‌ను ఉచితంగా అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని గురువారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు నిర్వహించి బడీడు పిల్లలను, బడిమానేసిన విద్యారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బడిబాట కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీతోపాటు, జిల్లా, మండల విద్యాధికారులు, హెడ్మాస్టర్లు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని సూచించింది. కలెక్టర్‌ నేతృత్వంలో డీఈవోలు, ఎంఈవోలు ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో బడిబాటకు కార్యాచరణ రూపొందించుకోవా లని ఆదేశించడంతో ఇటీవల కలెక్టర్‌ పమేలాసత్పతి విశిధ శాఖ అధికారులతో బడిబాట కార్యక్రమంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించి దశాదిశ నిర్దేశం చేశారు. దీంతో గురువారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, యువజన సంఘాల కమిటీలతో సమావేశాలు నిర్వహించుకొని, గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. విద్యాశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఫ ‘బడిబాట’ షెడ్యూల్‌:

- 6న పాఠశాల స్థాయి సమావేశాలు విలేజ్‌ ఆర్గనైజర్లు, మహిళా సంఘాలు, అమ్మ ఆదర్శ కమిటీలు, ఉపాధ్యాయులతో నిర్వహించాలి. అందరితో ప్రతిజ్ఞ చేయించాలి.

- 7న గ్రామాలను సందర్శించి విలేజ్‌ ఎడ్యుకేషన్‌ రిజిస్టర్‌ అప్‌డేట్‌ చేయాలి.

- 8 నుంచి 10వ తేదీ వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించి బడిబయట పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలల్లో చేర్పించాలి.

- 11న గ్రామసభలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట విషయాలను చర్చించాలి.

- 12న పాఠశాల పునః ప్రారంభం రోజు విద్యార్థులకు స్వాగతం పలకాలి.

- 13న ఎఫ్‌ఎల్‌ఎన్‌ యాక్టివిటిస్‌ డే నిర్వహించాలి.

- 14న ప్రాథమిక పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం, ఉన్నతపాఠశాలలో బాల సభ నిర్వహించాలి.

- 15న గర్ల్‌ చైల్డ్‌ డే నిర్వహించాలి.

- 18న డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ డే నిర్వహించాలి.

- 19న స్పోర్ట్స్‌ డేతో పాట బడిబాట ముగింపు కార్యక్రమాలు నిర్వహించాలి.

ఫ సప్తగిరి కాలనీ పాఠశాలలో..

జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ముందుగా పాఠశాలలో స్థానిక కార్పొరేటర్‌ చాడగొండ బుచ్చిరెడ్డి, లయన్స్‌క్లబ్‌, వాకర్స్‌ అసోసియేషన్‌, స్వచ్ఛంద సంస్థల సహకారంతో డివిజన్‌లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ బడీడు, బడిమానేసిన పిల్లందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, విద్యతోనే పిల్లలకు భవిష్యత్‌ ఉంటుందని ప్రజలకు పిలుపునిచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం రాజేందర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నామని, ఆధునిక విద్యావసరాలకు అనుగుణంగా అత్యుత్తమమైన టెక్నాలజీతో విద్యాబోధన చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపతి, గాజుల రవీందర్‌, తూముల తిరుపతి, ప్రసాద్‌, శ్రీనివాస్‌, స్వామి, సత్యనారాయణరావు, రామారావు, అన్నపూర్ణ, ఉమా మల్లీశ్వరీ, గీత, పద్మజ, అపోలినా, షబానా, భారతి, ప్రమీల, శంకరయ్య, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు కోటేశ్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 12:41 AM