వైభవంగా మహాశక్తి ఆలయ వార్షికోత్సవం
ABN , Publish Date - Jun 11 , 2024 | 11:53 PM
జిల్లా కేంద్రంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో మంగళవారం చతుర్దశ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
![వైభవంగా మహాశక్తి ఆలయ వార్షికోత్సవం](https://media.andhrajyothy.com/media/2024/20240604/11201_58ad80fc15.jpg)
కరీంనగర్ కల్చరల్, జూన్ 11: జిల్లా కేంద్రంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో మంగళవారం చతుర్దశ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని ప్రతిష్ఠించిన జగద్గురు శంకరాచార్య హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 4-30 గంటల నుంచి అమ్మవార్లకు అభిషేకం, స్వస్తి పుణ్యాహవాచనం, గణపతి పూజ, లక్ష్మీగణపతి హోమం, రుద్ర సహిత ఛండీ హోమం జరిగింది. రాత్రి 7 గంటల నుంచి ముత్తైదువులచే సామూహిక కుంకుమార్చనలు, హనుమాన్ చాలీసా, లలితా సహస్రనామ పారాయణాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం స్వామీజీ అనుగ్రహభాషణం చేశారు. కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సతీమణి అపర్ణ, భక్తులు పాల్గొన్నారు. నాలుగు ధర్మాలతో పాటు ఐదవ ధర్మమైన సమాజసేవలో అందరూ సమాజదేవో భవ అంటూ భాగస్వాములు కావాలని హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి పేర్కొన్నారు. దేవాలయం ఓ స్ఫూర్తి కేంద్రం. భారతీయ సంస్కృతి శ్రేష్టమైంది. ప్రతి ఒక్కరూ చిన్నా పెద్దా ఆలయాలను సందర్శించి తోచిన సహాయం చేయాలి. విదేశాలు కూడా అనుసరిస్తున్న భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను, ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.