Share News

‘రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌పై ఆరోపణలు’

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:44 AM

రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు.

‘రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌పై ఆరోపణలు’

కరీంనగర్‌ అర్బన్‌, మార్చి 8: రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. ప్రజలను తప్పుదోవపట్టిస్తే ఊరుకోబోమని ఆయన అన్నారు. నగర కాంగ్రెస్‌ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక రైతు సెల్‌ఫోన్‌లో రాత్రి మాత్రమే త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేస్తామని విద్యుత్‌ శాఖ అధికారులు మెస్సేజ్‌ పెట్టారని చెప్పిన ఎమ్మెల్యే కేటీఆర్‌ దానిని చూపించలేకపోయారని విమర్శించారు. ఇప్పటికైనా డ్రామాలు మానుకోవాలని అన్నారు. ఇరుకుల్ల గ్రామ రైతులు గత ఏడాది అకాల వర్షాలకు పంట నష్టపోతే పరిహారం ప్రకటించి ఒక్కరూపాయి ఇవ్వకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటన్నారు. రైతులకు కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా ఇస్తున్నామని విద్యుత్‌ శాఖ అధికారులు స్పష్టంగా చెబుతున్నారని అన్నారు. ప్రతి సంవత్సరంలాగా వేసవి కాలంలో కొంతమేర నీటి ఎద్దడి ఉంటుందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు బాద్యతారహితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నీటి ఎద్దడి వచ్చిందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో ఎండీ తాజ్‌, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, సయ్యద్‌ అఖిల్‌, షేక్‌ షహేన్‌షా, భారీ, కీర్తికుమార్‌, సత్యనారాయణరెడ్డి, అష్రాఫ్‌, బషీర్‌, ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 12:44 AM