Hyderabad: వారం నుంచి విష జ్వరం.. ఆపై గుండెపోటు.. కెనడాలో హైదరాబాద్ యువకుడి మృతి
ABN , Publish Date - Feb 17 , 2024 | 11:46 AM
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన హైదరాబాద్(Hyderabad) యువకుడు కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ టోలిచౌకీ బాల్రెడ్డినగర్ వాసి షేక్ ముజామీల్ అహ్మద్ (25) మాస్టర్స్ కోసం 2022లో కెనడా వెళ్లాడు.
![Hyderabad: వారం నుంచి విష జ్వరం.. ఆపై గుండెపోటు.. కెనడాలో హైదరాబాద్ యువకుడి మృతి](https://media.andhrajyothy.com/media/2024/20240215/city4_13efe345b1.jpg)
హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన హైదరాబాద్(Hyderabad) యువకుడు కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ టోలిచౌకీ బాల్రెడ్డినగర్ వాసి షేక్ ముజామీల్ అహ్మద్ (25) మాస్టర్స్ కోసం 2022లో కెనడా వెళ్లాడు. ఒంటారియో ప్రావిన్స్ కిచెనర్ సిటీలోని కొనెస్టోగా కళాశాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చదువుతున్నాడు. అహ్మద్ వారం రోజులుగా విష జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం అతడు చనిపోయాడంటూ కుటుంబ సభ్యులకు స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అహ్మద్ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. ముజామీల్ తండ్రి షేక్ ముజాఫర్ అహ్మద్ కుటుంబాన్ని ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియొద్దీన్, ఎంబీటీ అధికార ప్రతినిధి మహ్మద్ అంజాదుల్లా ఖాన్ పరామర్శించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ద్వారా విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్కు వివరాలు అందజేశారు. ఒట్టావాలోని భారత హైకమిషన్, టొరంటోలోని కాన్సులేట్ జనరల్కు ఆదేశాలు జారీ చేసి అహ్మద్ మృతదేహాన్ని స్వదేశం తీసుకొచ్చేందుకు సాయం చేయాలని కోరారు. మృతదేహన్ని భారత్కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ధీరజ్ పారిక్ సమాచారమిచ్చారు.