Share News

Hyderabad: హుస్సేన్‌సాగర్‌ అలలపై.. అద్భుత లేజర్‌ షో.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏర్పాటు..

ABN , Publish Date - Mar 12 , 2024 | 09:16 AM

భాగ్యనగరంలో పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్‌ స్ర్కీన్‌, మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌పై లేజర్‌ ఆధారిత సౌండ్‌, లైట్‌ షోను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు.

Hyderabad: హుస్సేన్‌సాగర్‌ అలలపై.. అద్భుత లేజర్‌ షో.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏర్పాటు..

- నేటి సాయంత్రం ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ: భాగ్యనగరంలో పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్‌ స్ర్కీన్‌, మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌పై లేజర్‌ ఆధారిత సౌండ్‌, లైట్‌ షోను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. ఓ చెరువు అలలపై లేజర్‌ ఆధారిత సౌండ్‌ అండ్‌ లైట్‌ షో ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. ఈ లైట్‌ అండ్‌ సౌండ్‌ షోలో.. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన ‘కోహినూర్‌’ వజ్రం గురించిన కథ కూడా ఉంటుంది. తెలంగాణ భూముల్లోనే కోహినూర్‌ వజ్రం లభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి మొదలైన కోహినూర్‌ కథ.. భిన్న సంస్కృతులు, వివిధ ఖండాలను దాటి చేసి ప్రయాణాన్ని వాటర్‌ స్ర్కీన్‌పై రంగుల రంగుల లేజర్‌ వెలుతురులో వివరించనున్నారు. ఈ కథను ఎంపీ, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ పర్యవేక్షణలో.. ప్రముఖ రచయిత ఎస్‌ఎస్‌ కంచి రాశారు. సినీ నేపథ్య గాయని సునీత గాత్రాన్ని అందించగా.. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతాన్ని అందించారు. కోహినూర్‌ కథతో పాటుగా.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, దేశ స్వాతంత్య్ర సంగ్రామం వంటి ఘట్టాలను కూడా అందమైన లైటింగ్‌ ప్రొజెక్షన్‌ ద్వారా పర్యాటకులను ఆకట్టుకునేలా వివరిస్తారు. తెలంగాణ కథ, సంస్కృతి, దేశ సంస్కృ తి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ షోను రూపొందించినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయ వర్గాలు వివరించాయి. ఇక ఈ లేజర్‌ షోకు వచ్చే పర్యాటకులకు సరైన సూచికలు, 800 నుంచి 1,000 మంది కూర్చునేలా సీటింగ్‌ ఏర్పాట్లున్నాయి. ఇందుకోసం అన్ని వసతులతో కూడిన గ్యాలరీని కూడా సిద్ధం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొననున్నారు.

ప్రాజెక్టు ప్రత్యేకతలివే..

రొబోటిక్‌ నాజిల్స్‌, లైటింగ్‌: వెయ్యికి పైగా రొబోటిక్‌ నాజిల్స్‌, డీఎంఎక్స్‌ ప్రొటోకాల్‌తో కూడిన అడ్వాన్స్‌డ్‌ అండర్‌ వాటర్‌ లైటింగ్‌ సిస్టమ్స్‌ ద్వారా అద్భుతమైన రంగురంగుల లైట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ లేజర్‌ రంగుల కోసం.. మూడు 40 డబ్ల్యూ ఆర్‌జీబీ లేజర్స్‌ను ఏర్పాటు చేశారు.

గ్యాలరీ, రూఫ్‌టాప్‌ రెస్టారెంట్‌: 800 నుంచి 1,000 మంది కూర్చునేలా సీటింగ్‌ గ్యాలరీ, మల్టీమీడియా షో వీక్షించేందుకు పనోరమిక్‌ వ్యూ కోసం రూఫ్‌ టాప్‌ రెస్టారెంట్‌ను సిద్ధం చేశారు.

హెచ్‌డీ ప్రొజెక్షన్‌: ఒక్కొక్కటి 34 వేల ల్యుమెన్స్‌ సామర్థ్యం గల 3 హెచ్‌డీ ప్రొజెక్టర్స్‌ ద్వారా.. వాటర్‌ స్ర్కీన్‌పై స్పష్టమైన, ఆకర్షణీయ ప్రొజెక్షన్‌ ఉండేలా ఏర్పాట్లున్నాయి. బీమ్‌ మూవింగ్‌ హెడ్‌లైట్స్‌ ద్వారా.. విజువల్‌ ఎఫెక్ట్‌ అందంగా ఉండనుంది.

రికార్డ్‌-బ్రేకింగ్‌ వాటర్‌ ఫౌంటెయిన్‌: 260 అడుగుల ఎత్తు, 540్ఠ130 డైమెన్షన్‌తో దేశంలోనే అతి పెద్ద, అతి ఎత్తయిన వాటర్‌ ఫౌంటేన్‌ను ఈ ప్రాజెక్టులో వినియోగిస్తున్నారు.

Updated Date - Mar 12 , 2024 | 09:16 AM