Share News

Hyderabad: ‘మహా’ ఆఫీస్‌ @ పైగా ప్యాలెస్‌

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:26 PM

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కార్యాలయం బేగంపేట(Begumpet)లోని పైగా ప్యాలె్‌సకు మారనుంది. 15ఏళ్ల క్రితం వరకు అక్కడే ఉన్న హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని తిరిగి యథాస్థానానికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది.

Hyderabad: ‘మహా’ ఆఫీస్‌ @ పైగా ప్యాలెస్‌

- ఆగస్టులోగా తరలించేందుకు ప్రణాళికలు

- ఇక అద్దెకు అమీర్‌పేట్ స్వర్ణజయంతి కాంప్లెక్స్‌

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కార్యాలయం బేగంపేట(Begumpet)లోని పైగా ప్యాలెస్ కు మారనుంది. 15ఏళ్ల క్రితం వరకు అక్కడే ఉన్న హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని తిరిగి యథాస్థానానికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. తొలుత ఆ ప్యాలె్‌సను సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) క్యాంప్‌ ఆఫీసు కోసం పరిశీలించారు. రేవంత్‌రెడ్డి విముఖత చూపినట్లు తెలిసింది. దీంతో పైగా ప్యాలె్‌సలో హెచ్‌ఎండీఏ కార్యాలయం కొనసాగించడానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం.

ప్యాలెస్‌ విశిష్ఠత ఇదీ..

బేగంపేట చిరాన్‌లేన్‌లోని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పైగా ప్యాలెస్‌ ఇంద్ర భవనంలా ఉంటుంది. ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ దగ్గర ప్రధానమంత్రిగా పని చేసిన నవాబ్‌ వికారుల్‌ ఉమ్రా 1900లో ఈ ప్యాలెస్‌ నిర్మించారు. ఉమ్రా పైగా వంశానికి చెందినవారు కావడంతో దీనికి పైగా ప్యాలె్‌సగా పేరొచ్చింది. అత్యాధునిక హంగులతో యూరోపియన్‌ శైలిలో ప్యాలెస్‌ నిర్మించారు. ఈ ప్యాలె్‌సకు 22 అడుగుల ఎత్తయిన పైకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులున్నాయి. వాటి బాతురూమ్‌లే 300 చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్నాయంటే ప్యాలెస్‌ ఏరకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్యాలెస్‌ రెండో అంతస్తుకు చేరుకోవడానికి కలపతో చేసిన మెట్లుంటాయి.

హుడా ఏర్పాటు పైగా ప్యాలెస్‌లోనే..

ఉమ్మడిరాష్ట్రంలో 1975లో హైదరాబాద్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హుడా) ఏర్పాటైంది. తొలినాళ్లలో కార్యాలయాన్ని పైగా ప్యాలె్‌సలో ఏర్పాటు చేశారు. నిజాం పాలన తర్వాత పైగా ప్యాలెస్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడంతో అప్పట్లో హుడా కార్యాలయం కోసం కేటాయించారు. హుడాకు తొలి చైర్‌పర్సన్‌గా సరోజినీ పుల్లారెడ్డి ఉండగా, తొలి వైస్‌చైర్మన్‌గా ఐఏఎస్‌ అధికారి వసంత్‌ బవా కొనసాగారు. 2008లో హుడా పరిధిని ఏడు జిల్లాలకు విస్తరిస్తూ అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెచ్‌ఎండీఏగా మార్చారు. ఆ సమయంలో హుడా కార్యాలయంగా కొనసాగుతున్న పైగా ప్యాలె్‌సను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయానికి అప్పగించారు. దాంతో హెచ్‌ఎండీఏ కార్యాలయం తార్నాకలోని హుడా కాంప్లెక్స్‌లోకి మారి 12 ఏళ్లు కొనసాగింది. మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌కు తరలించారు.

15ఏళ్ల పాటు యూఎస్‌ కాన్సులేట్‌ కోసం..

హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సులేట్‌ నిర్వహణ కోసం పైగా ప్యాలెస్‏ను కేటాయించారు. 15 ఏళ్ల అనంతరం గతేడాది ఏప్రిల్‌లో తిరిగి హెచ్‌ఎండీఏకు అప్పగించారు. ప్రస్తుతం పైగా ప్యాలెస్‌ ఖాళీగా ఉన్నది. శతాబ్దకాలమైనా ప్యాలెస్‌ కళ ఏమాత్రమూ చెదరలేదు. ఈ భవనాన్ని హెచ్‌ఎండీఏ వాసరత్వకట్టడంగా కూడా గుర్తించింది. కాగా, అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోని రెండు, మూడు, నాలుగు, ఐదు, ఏడు అంతస్తుల్లో ప్రస్తుతం హెచ్‌ఎండీఏ కార్యాలయం కొనసాగుతున్నది. ఖాళీ చేసిన తర్వాత ఆ అంతస్తులను ఆఫీసు లీజుకివ్వడం వల్ల నెలకు కోటి రూపాయల పైగా ఆదాయం రావడానికి అవకాశాలున్నాయి.

Updated Date - Mar 12 , 2024 | 01:26 PM