Share News

Hyderabad: రైతుబంధుకు లైన్‌క్లియర్‌.. 16న ఆర్బీఐ నుంచి 2 వేల కోట్ల రుణం

ABN , Publish Date - Jan 14 , 2024 | 08:57 AM

యాసంగి పంటలకు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం దక్కనుంది. రైతుబంధు చెల్లింపులకు నిధుల కొరత రూపంలో ఉన్న అడ్డంకులు తొలగున్నాయి.

Hyderabad: రైతుబంధుకు లైన్‌క్లియర్‌.. 16న ఆర్బీఐ నుంచి 2 వేల కోట్ల రుణం

- కేంద్రం నుంచి 9 వేల కోట్ల రుణం మంజూరు

- ఈ పథకానికి రూ.7,625 కోట్లు అవసరం

- సర్దుబాటు చేయాల్సినది రూ.6,600 కోట్లు

- ఫిబ్రవరితో నగదు బదిలీ పూర్తయ్యే అవకాశం

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): యాసంగి పంటలకు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం దక్కనుంది. రైతుబంధు చెల్లింపులకు నిధుల కొరత రూపంలో ఉన్న అడ్డంకులు తొలగున్నాయి. నత్తనడకన సాగుతున్న రైతుబంధు నిధుల జమ వ్యవహారం సంక్రాంతి పండుగ తర్వాత పుంజుకోనుంది.. రైతుబంధు పథకం కోసం రెండు, మూడు రోజుల్లో నిధులు సర్దుబాటు కానున్నాయి. కేంద్ర ప్రభు త్వం తాజాగా రూ. 9 వేల కోట్ల రుణం మంజూరుచేయగా అందులో ఈనెల 16వ తేదీన రూ. 2 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా రైతుబంధు పథకం కింద నగదు బదిలీకి మార్గం సుగమమైంది. సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఖజానాకు నిధులు రాగానే... చెల్లింపులను ప్రారంభించి, ఫిబ్రవరిలో పూర్తిచేయటానికి సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబరు 9వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే! అయితే ఖజనాలో డబ్బులు నిండుకోవటంతో రైతుబంధుకు నిధులు సర్దుబాటు చేయటం కష్టంగా మారింది. తొలుత ఒకఎకరం వరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు సుమారు 21 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,050 కోట్లు జమ చేశారు. నిధులు సర్దుబాటైతే రెండెకరాల వరకు, ఆతర్వాత మూడెకరాల వరకు... ఇలా రోజు రోజుకు విస్తీర్ణం పెంచుకుంటూ నగదు బదిలీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ నిధుల కొరత కారణంగా నెల రోజుల్లో రూ.వెయ్యి కోట్ల వరకే చెల్లింపులు చేయగలిగింది. రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల విస్తీర్ణానికి రైతుబంఽధు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 69 లక్షల మంది రైతులకు రూ. 7,625 కోట్ల నిధులు కావాలి. ఇందులో ఇప్పటిదాకా కేవలం వెయ్యి కోట్ల వరకే నిధులు సర్దుబాటయ్యాయి. ఇంకా 48 లక్షల మంది రైతులకు చెల్లించటానికి సుమారు రూ. 6,600 కోట్ల వరకు నిధులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ. 9 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలతో కూడిన చివరి త్రైమాసికానికి అప్పు తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వటంతో రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. ఈ క్రమంలో ఈనెల 16 తేదీన ఆర్బీఐ నిర్వహించే వేలంపాటలో పాల్గొని రూ. 2 వేల కోట్లకు లోన్‌ ఇండెంట్‌ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన రూ. 7 వేల కోట్లను కూడా విడతలవారీగా తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే తొలి విడతలో రూ. 2 వేల కోట్లు రాగానే... రైతుబంధు పథకానికే కేటాయించాలని సర్కారు భావిస్తోంది. ఆర్బీఐ నుంచి ఖజానాకు నిధులు వస్తున్న కొద్దీ... వాటిని రైతుబంధుకు కేటాయించే అవకాశాలున్నాయి.

Updated Date - Jan 14 , 2024 | 09:21 AM