Hyderabad: కొండెక్కిన ‘కోడి పుంజు’.. రూ.800 నుంచి రూ.3వేల వరకు..
ABN , Publish Date - Jan 14 , 2024 | 12:24 PM
సంక్రాంతి వచ్చిందంటే నాటుకోళ్లకు మస్త్ గిరాకీ ఉంటుంది. దీంతో నాటుకోళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణ రోజుల్లో లభించే కోడిపుంజుల ధరలు రెండు, మూడింతలు పెరిగాయి. అయినప్పటికీ శివారు ప్రాంతాల్లో జరిగే సంతల్లో వాటి విక్రయాలు జోరుగా సాగాయి.
![Hyderabad: కొండెక్కిన ‘కోడి పుంజు’.. రూ.800 నుంచి రూ.3వేల వరకు..](https://media.andhrajyothy.com/media/2023/20231205/city2_2_1c3f8f3096.jpg)
- సంతల్లో జోరుగా విక్రయాలు
నార్సింగ్(హైదరాబాద్), (ఆంద్రజ్యోతి): సంక్రాంతి వచ్చిందంటే నాటుకోళ్లకు మస్త్ గిరాకీ ఉంటుంది. దీంతో నాటుకోళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణ రోజుల్లో లభించే కోడిపుంజుల ధరలు రెండు, మూడింతలు పెరిగాయి. అయినప్పటికీ శివారు ప్రాంతాల్లో జరిగే సంతల్లో వాటి విక్రయాలు జోరుగా సాగాయి. సంక్రాంతి(Sankranti)ని దృష్టిలో పెట్టుకుని నగర శివారు ప్రాంతాల్లోని పల్లెలు, పట్టణాలలో నాటు కోళ్లను ప్రత్యేకంగా పెంచుతుంటారు. పండుగ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లోని కోళ్ల మార్కెట్లు కోడిపుంజులతో నిండిపోయాయి. పాతబస్తీలోని ముర్గీచౌక్, ఎర్రగడ్డ, లింగంపల్లి, ముషీరాబాద్(Erragadda, Lingampally, Mushirabad), మెహిదీపట్నం వంటి కోళ్ల మార్కెట్లు కోడిపుంజులతో కళకళలాడుతున్నాయి. అంతేకాకుండా నార్సింగి, లింగంపల్లి, మంగళ్హాట్, మొయినాబాద్ సంతల్లో కూడా వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, నాటుకోళ్ల ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నార్సింగ్లో జరిగే సంత పశువుల క్రయవిక్రయాలకే కాకుండా కోడిపుంజుల అమ్మకాలకు కూడ పేరుంది. దీంతో శుక్రవారం జరిగిన సంతలో దాదాపు రెండు వందలకుపైగా కోడి పుంజులు అమ్ముడు పోయాయి. అయితే, ధర అధికంగా ఉండడంతో కొనుగోలు దారులు నీరసించిపోయారు. సాధారణంగా ఇక్కడ కోడిపుంజు రూ.250 వరకు దొరుకుతుంది. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో ఒక్కోపుంజును రూ.800నుంచి రూ.మూడువేల వరకు విక్రయించారు. ఇక భారీ సైజులో ఉన్న ఓ కోడిపుంజులకు ధర మరింత అదనంగా ఉండడం కొనుగోలుదారులను కలవరపరిచింది.