Share News

Hyderabad: ఎలా బతికేది.. ‘గాంధీ’లో మూడు నెలలుగా జీతాల్లేవ్‌..

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:11 AM

గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital)లో అవుట్‌సోర్సింగ్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న నర్సులు, పారిశుధ్య కార్మికులు పేషేంట్‌ కేర్‌లకు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Hyderabad: ఎలా బతికేది.. ‘గాంధీ’లో మూడు నెలలుగా జీతాల్లేవ్‌..

- కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపం

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital)లో అవుట్‌సోర్సింగ్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న నర్సులు, పారిశుధ్య కార్మికులు పేషేంట్‌ కేర్‌లకు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వ హయంలో గాంధీ ఆస్పత్రిలో 10 మంది కాంట్రాక్టర్లు ఉండేవారు. ఈ కాంట్రాక్టర్ల టెండర్‌ సమయం ముగిసిపోవడంతో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులు, పారిశుధ్య కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదు. కొత్తగా అవుట్‌సోర్స్‌ టెండర్‌ ప్రకారం మరో 9మంది కాంట్రాక్టర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ కాంట్రాక్టర్లు ఇంకా గాంధీలో సూపరింటెండెంట్‌ నుంచి అనుమతి తీసుకోలేదు. కొత్త కాంట్రాక్టర్లు వచ్చినప్పటికీ ఇప్పటికీ 200 మంది అవుట్‌సోర్సింగ్‌ నర్సులు, 200 మంది పారిశుధ్య కార్మికులు, పేషంట్‌ కేర్‌ ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదు. ఒక్కొక్కరికి రూ.13,500 చొప్పున రావాల్సి ఉంది. పాత కాంట్రాక్టర్లు, కొత్త కాంట్రాక్టర్ల మధ్య సమయన్వయలోపం కారణంగా ఉద్యోగులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజుల్లో తమకు జీతాలు ఇవ్వకపోతే ప్రగతి భవన్‌ వద్ద ధర్నా చేస్తామని బాధిత ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఓఎస్‌డీ, కలెక్టర్‌కు వినతి

గాంధీ ఆస్పత్రిలో అవుట్‌సోర్సింగ్‌ విభాగంలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మూడు నెలల నుంచి జీతాలు రావడంలేదని పబ్లిక్‌ హెల్త్‌- మెడికల్‌ ఎంప్లాయీస్‌ (ఐఎన్‌యూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు యూనియన్‌ నేతలతో కలిసి ఆయన బుధవారం రాష్ట్ర ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఓఎ్‌సడీ రామకృష్ణకు, జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇప్పటి వరకూ ఈఎ్‌సఐ, పీఎ్‌ఫలు కట్‌ అవడంలేదని యూనియన్‌ నేతలు తెలిపారు.

Updated Date - Mar 14 , 2024 | 11:11 AM