Share News

KCR : కాంగ్రెస్‌ ఐదేళ్లూ ఉండదు

ABN , Publish Date - May 06 , 2024 | 05:48 AM

‘‘కాంగ్రెస్‌ పాలనపై నాలుగైదు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్‌ సర్కారు పనైపోయింది. ఐదేళ్లు కొనసాగే పరిస్థితి లేదు. అతి తొందరలోనే కాంగ్రెస్‌ సర్కారు ట్రాక్‌ తప్పింది. ఇప్పుడున్న కాంగ్రెస్‌ నాయకుల చేతగానితనమే

KCR : కాంగ్రెస్‌ ఐదేళ్లూ ఉండదు

ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది బీఆర్‌ఎస్సే

తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు

రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మిగిలే ఉంది

కాంగ్రెస్‌ సర్కారుకు తోక.. తొండం తెలవదు

తులం బంగారం తుస్‌.. రాహుల్‌వి అబద్ధాలే

నీళ్ల తరలింపు కుట్రపై సప్పుడు చేయని రేవంత్‌

నేను సీఎంగా ఉన్నప్పుడు ఒప్పుకోలేదు

నూకలు తినమన్న మోదీకెందుకు ఓటెయ్యాలి?

ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీని చిత్తుచేయాలి

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యలు

హుజూరాబాద్‌/వీణవంక/జగిత్యాల, మే 5: ‘‘కాంగ్రెస్‌ పాలనపై నాలుగైదు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్‌ సర్కారు పనైపోయింది. ఐదేళ్లు కొనసాగే పరిస్థితి లేదు. అతి తొందరలోనే కాంగ్రెస్‌ సర్కారు ట్రాక్‌ తప్పింది. ఇప్పుడున్న కాంగ్రెస్‌ నాయకుల చేతగానితనమే ఇందుకు కారణం. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే’’ అని బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదని, పునర్నిర్మాణ ప్రక్రియ మిగిలే ఉందని స్పష్టం చేశారు. తాను చేస్తున్న బస్సుయాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక.. కాంగ్రెస్‌, బీజేపీలు కుతంత్రంతో 48 గంటల పాటు ప్రచారాన్ని ఆపించాయని విమర్శించారు. రైతులు నాట్లు వేసేప్పుడే బీఆర్‌ఎస్‌ సర్కారు రైతుబంధు ఇస్తే.. కాంగ్రెస్‌ హయాంలో వడ్లు అమ్ముకుంటున్నా డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. ఆదివారం ఆయన కరీంనగర్‌ జిల్లా వీణవంకలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో, జగిత్యాలలో జరిగిన రోడ్‌షోలలో మాట్లాడారు. ‘‘గోదావరి నీళ్లను కర్ణాటక, తమిళనాడుకు తరలించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. నేను సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ ఢిల్లీలో మీటింగ్‌కు పిలిచి అడిగితే, నేను ఒప్పుకోలేదు. తెలంగాణ నీటి వాటాను తేల్చాకే మాట్లాడతానని సూటిగా చెప్పాను. మోదీ మీటింగ్‌కు హాజరుకాలేదు. ఇప్పుడు ఆ కుట్రలు ముమ్మరమయ్యాయి. సీఎం రేవంత్‌ మాత్రం సప్పుడు చేయడం లేదు’’ అని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రధాని మోదీ అసూయపడేలా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చామని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ వచ్చాక.. రూ.వెయ్యి కోట్లతో వచ్చిన ఓ ఐటీ ప్రాజెక్టు తమిళనాడుకు వెళ్లిపోయిందని విమర్శించారు. ‘కాంగ్రెస్‌ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. ఐదు నెలలు గడిచినా.. ఆరు గ్యారెంటీలు.. పింఛన్‌ పెంపు లేనేలేదు. కరెంటు కోతలతో ఓ అల్యూమినియం కంపెనీ వేరే ప్రాంతానికి తరలిపోయేందుకు ప్రయత్నిస్తోంది’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజల్ని నూకలు తినమన్న మోదీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్‌ సర్కారుకు తోక, తొండం తెలియదు. బీఆర్‌ఎస్‌ హయాంలో వరద కాల్వను రిజర్వాయర్‌గా చేసుకున్నాం. ఇప్పుడు వరదకాల్వలను ఎండబెట్టారు. ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ సర్కారు ఆగమాగం చేసింది’’ అని కేసీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ చెప్పిన వరికి రూ.500 బోనస్‌ అంతా బోగస్‌ అని.. కల్యాణలక్ష్మితో తులం బంగారం తుస్‌ అని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆగిపోయాయని, గురుకులాల విద్యార్థులు కలుషితాహారం తిని అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొన్నారు. నిర్మల్‌ బహిరంగ సభలో రాహుల్‌ అబద్ధాలు చెప్పారని కేసీఆర్‌ విమర్శించారు. రూ.25 వేలు మహిళల ఖాతాల్లో వేస్తున్నామని రాహుల్‌ చెప్పారని, ఎవరి ఖాతాలోనైనా డబ్బులు పడ్డాయా? అని ప్రశ్నించారు. నిజామాబాద్‌కు ఎంపీగా అర్వింద్‌ చేసిందేమీ లేదని, పసుపుబోర్డు రాలేదని, దక్కన్‌ షుగర్‌ను తెరవలేదని విమర్శించారు. రేవంత్‌ సర్కారు జగిత్యాల జిల్లాను తీసేస్తామంటోందని.. జగిత్యాల జిల్లాగా ఉండాలంటే నిజామాబాద్‌ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్‌ను, పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్‌ను, కరీంనగర్‌ ఎంపీగా బోయినపల్లి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.


టీ తాగి.. సెల్ఫీలకు చాన్సిచ్చిన కేసీఆర్‌

మల్యాల, మే 5: నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్‌కు మద్దతుగా ప్రచారానికి బస్సుయాత్రగా బయలుదేరిన కేసీఆర్‌ మార్గమధ్యంలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆగారు. ఇక్కడి టీపాయింట్‌లో దాదాపు గంటపాటు కూర్చుని, టీ తాగారు. సమోసాలు తెప్పించుకుని తిన్నారు. ఈ సందర్భంగా తనతో సెల్ఫీలు దిగడానికి వచ్చిన ప్రజలు, చిన్నారులకు కేసీఆర్‌ అవకాశమిచ్చారు. వారితో ముచ్చటించారు. ఓ దశలో భద్రతాసిబ్బంది ప్రజలను తోసివేయడంపై స్థానిక నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బందిని ఎందుకు వారించలేదన్నట్లు విమర్శిస్తూ.. ‘‘మీలాంటి నాయకుల వల్లే పార్టీ అధికారం కోల్పోయింది’’ అని మండిపడ్డారు.

Updated Date - May 06 , 2024 | 05:48 AM