అనుమతులు లేని వెంచర్లు
ABN , Publish Date - Mar 03 , 2024 | 10:30 PM
జిల్లాలో అనుమతి లేని వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అమాయ కులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వాటిని కొనుగోలు చేసిన ప్రజలు రిజిస్ర్టేషన్, ఇంటి నిర్మాణ అనుమతులు, బ్యాంకు లోన్ పొందే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏసీసీ, మార్చి 3: జిల్లాలో అనుమతి లేని వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అమాయ కులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వాటిని కొనుగోలు చేసిన ప్రజలు రిజిస్ర్టేషన్, ఇంటి నిర్మాణ అనుమతులు, బ్యాంకు లోన్ పొందే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరు రియల్టర్టు ధరణి పోర్టల్ ద్వారా పట్టాదారు పాసుబుక్తో తహసీల్దార్ కార్యాలయం సిబ్బందితో కుమ్మక్కై గుంట, రెండు గుంటల వంతున మండల రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్ ద్వారా విక్రయిస్తున్నారు.
-డీటీసీపీ, రెరా అనుమతులు లేకుండా ప్లాట్ల ఏర్పాటు
వ్యవసాయ భూములను ప్లాట్లుగా విక్రయించాలంటే నాలా కన్వర్షన్ ద్వారా ఆర్డీవో నుంచి ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది. అనంతరం డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నుంచి అనుమతి పొందాలి. డీటీసీపీ అనుమతి కోసం నీటి పారుదల, రెవెన్యూ, మున్సిపల్ శాఖల నుంచి ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. వెంచర్లో పది శాతం స్ధానిక సంస్థలకు రిజిస్ర్టేషన్ చేయాలి. వెంచర్కు అప్రోచ్ రోడ్లు 60 ఫీట్లు, లోపల 40 ఫీట్ల రోడ్లు, 33 ఫీట్ల వెడల్పు రోడ్లు ఏర్పాటు చేయా లి. పాఠశాల, పార్కు, గుడి, కమ్యూనిటీ హాలు, హెల్త్ సెంటర్, ఓవర్ హెడ్ ట్యాంకు అవసరాలకు స్థలం కేటాయించాలి. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్లైన్లు వంటి అభివృద్ధి పనులు, రియల్ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే ఇరుకు రోడ్లతో వెంచర్లు వెలుస్తున్నాయి. రియల్టర్లు ప్రభుత్వానికి ఫీజులు, అను మతుల రూపంలో వచ్చే ఆదాయానికి గండి కొడుతూ నిబంధనలు పాటించకుండా ప్లాట్లను విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. వాటిని కొనుగోలు చేసిన ప్రజలు క్రమబద్దీకరణ, ఇంటి నిర్మాణానికి అనుమతులకు ఫీజులు, పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది.
- రిజిస్ర్టేషన్ చేయవద్దని లేఖలు రాసిన అధికారులు
జిల్లా కేంద్రంతోపాటు బెల్లంపల్లి, మందమర్రి, క్యాతనపల్లి, నస్పూర్, చెన్నూరు పట్టణాల్లో అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. వాటిని రిజిస్ర్టేషన్ చేయవద్దని అధికారులు రిజిస్ర్టార్కు లేఖలురాశారు. క్యాతనపల్లి మున్సి పల్ కమిషనర్ అనధికారికంగా వెంచర్లు ఏర్పాటుచేసిన పట్టాదారులకు జనవరి 25న నోటీసులు జారీ చేశారు. అలాగే అనధికార లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ర్టేషన్ చేయవద్దని సబ్ రిజిస్ర్టార్కు లేఖ రాశారు. జైపూర్ మండల పంచాయతీ ఆఫీసర్ 29న ప్లాట్లను రిజిష్ర్టేషన్ చేయవద్దని లేఖ రాశారు. చెన్నూరు మున్సిపల్ కమిషనర్ కూడా అనధికార లే అవుట్లలో ప్లాట్లను రిజిస్ర్టేషన్ చేయవద్దని జనవరి 30న సబ్ రిజిస్ర్టార్కు లేఖ అందించారు. ఫిబ్రవరి 29న మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ కూడా ప్లాట్లను రిజిష్ర్టేషన్ చేయవద్దని సబ్ రిజిస్ర్టార్కు లేఖ అందించారు. సబ్ రిజిస్ర్టార్ను కోరడంతోపాటు అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి గృహ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయమని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలకు అవగాహన లేక రియల్టర్ల వలలో పడి మోసపోతున్నారు.
-డీటీసీపీ తప్పనిసరి నిబంధనతో ఇక్కట్లు
డీటీసీపీ అనుమతి ఉంటేనే ప్లాట్లు రిజిస్ర్టేషన్ చేస్తామనే నిబంధనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరానికి పట్టా భూమిని విక్రయించలేక పోతున్నారు. వైద్య ఖర్చులకు పెళ్లిళ్లకు, పిల్లల చదువులకు అప్పులు తీర్చేందుకు, ఇల్లు కట్టుకునేందుకు ఇతర అవసరాలకు సొంత భూమిలో కొంత భాగాన్ని విక్రయించి రిజిస్ర్టేషన్ చేసే అవకాశం లేనం దున నిరాశతో కొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో విక్రయ ఒప్పందం కుదుర్చుకుని కొంత అడ్వాన్సుగా తీసుకున్నప్పటికి రిజిస్ర్టేషన్ కానందున డబ్బులు చెల్లించడం లేదు. కొన్ని సందర్భాల్లో గొడవలు, పంచాయతీలు కూడా అవుతున్నాయి.
అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనవద్దు
- మారుతి ప్రసాద్, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్
డీటీసీపీ అనుమతి లేకుండా అనధికారికంగా ఏర్పాటు చేసిన వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణానికి అనుమతులు మంజూరు కావు. పలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అక్రమ వెంచర్లపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ప్లాట్ల హద్దురాళ్లను తొలగిస్తూ పట్టాదారులకు నోటీసులు ఇస్తున్నాం.
అత్యవసారానికి అమ్ముకోలేక అవస్థలు
- సదువుల శివకుమార్, తీగల్ పహాడ్
అత్యవసరానికి పట్టా భూమిలో నుంచి కొంత భాగాన్ని అమ్ముకోలేక అవస్థలు పడుతున్నాం. గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం.