చెరువు మట్టి... చేనుకు పుష్టి
ABN , Publish Date - May 24 , 2024 | 10:23 PM
చెరువు మట్టి చేనుకు మేలు చేస్తోంది. వేసవిలో చెరువు నీరు ఎండిపోయినప్పుడు మట్టి తీసి రైతులు పొలాల్లో వేసుకుంటున్నారు. సాగు భూమిలో చెరువు మట్టిని వేసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయి.
![చెరువు మట్టి... చేనుకు పుష్టి](https://media.andhrajyothy.com/media/2024/20240511/41_DPL_22_b81f941cc4.jpg)
దండేపల్లి, మే 24: చెరువు మట్టి చేనుకు మేలు చేస్తోంది. వేసవిలో చెరువు నీరు ఎండిపోయినప్పుడు మట్టి తీసి రైతులు పొలాల్లో వేసుకుంటున్నారు. సాగు భూమిలో చెరువు మట్టిని వేసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయి. వర్షాలు పడినప్పుడు అనేక పోషక విలువలు కలిగిన సారవంతమైన మట్టి చెరువులోకి వచ్చి చేరుతుంది.
- నేలలోని లవణాల గాఢత తగ్గుతుంది.
- మట్టితోపాటు సేంద్రియ ఎరువు కలిపి వేసుకుంటే రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు.
- మొక్కలు ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతాయి.
- కలుపు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని నేలకు ఉంటుంది.
- దిగుబడి పెరిగి రైతులకు ఆదాయం వస్తుంది.
- నేల సారవంతమై అధిక దిగుబడినిస్తుంది.
చెరువులో పెరుగనున్న నీటి నిల్వలు
చెరువుల్లో పూడిక తీయడం ద్వారా నీటి నిల్వ పెరుగు తుంది. ఎక్కువగా నీరు నిలిచే అవకాశం ఉంటుంది. చెరు వు మట్టిని పొలాల్లో వేయడం ద్వారా నేల సారవంతం అవుతుంది. చెరువు మట్టిలో ఎక్కువగా ఉండే పోషకాల వల్ల నత్రజని ఎక్కువగా అందుతుంది. చెరువు మట్టిని పంట చేనులో వేయడం ద్వారా పంటలు అధిక దిగుబడి సాధించవచ్చు.
జీలుగ పంట సాగుతో..
జీలుగ సాగుతో అధిక దిగుబడులను సాధించవచ్చు. జీలుగ సాగు చేయడం వల్ల పచ్చిరొట్ట ఏర్పడి నేలలు సారవంతమవుతుంది. దీంతో భూసారం పెరగడంతో పంటల్లో అధిక దిగుబడులు వస్తాయి. చౌడు నేలలున్న ప్రాంతాల్లో జీలుగను సాగు చేస్తే నేలలు సారవంతమై సాగుకు అనుకూలంగా మారతాయి. వరి సాగుకు ముందు వేసవికాలంలో పంట నేలల్లో జీలుగ విత్తనాలను సాగు చేసుకుంటే నాట్లు వేస్తే సమయానికి ఏపుగా ఎదిగి పొలాన్ని భూసారవంతం చేస్తాయి..
భూమికి మంచి పోషక విలువలు...
ఎకరానికి 15 కిలోల జీలుగ విత్తనాలను మే, జూన్లో పంట పొలాల్లో చల్లుకోవాలి. కొద్దిగా నీటి తడి ఉంటే విత్తనాలు మొలకెత్తుతాయి. 45 రోజులకు మొక్కలు ఏపుగా ఎదిగి పూత దశకు చేరుకుంటాయి. పూతదశకు వచ్చిన జీలుగ చెట్లను నేలలోనే దున్నాలి. జీలుగ పచ్చిరొట్టగా మారి భూమి సారవంతమవుతుంది. భూమిలో పోషక విలువలు పెరిగి వరి పంటలకు మంచి బలాన్ని చేకూరుస్తాయి. జీలుగను భూమిలో దున్నుకోవడం ద్వారా చౌడు నివారణతోపాటు సేంద్రియ కర్బనాలను పెంచుకోవచ్చు. జీలుగను రోటివేటర్తో దున్నిన అనంతరం ఎకరానికి రెం డు బస్తాల చొప్పున సూపర్ను చల్లుకోవాలి. భూమిలోని సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి షోషకలోపాలు రాకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల రసాయన ఎరువులు వేసే అవసరం ఉండదు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీలుగ విత్తనాలను 50 శాతం రాయితీపై రైతులకు అందిస్తున్నారు. వానాకాలం సీజన్కు ముందు నేలలో జీలుగ విత్తనాలను తీసుకుని పొలాల్లో దున్నుకుంటే పం టలు అధిక దిగుబడి వచ్చి రైతులకు మంచి లాభాలు వస్తాయి.
చెరువు మట్టి, జీలుగ సాగుతో అనేక లాభాలు
గొర్ల అంజిత్కుమార్, మండల వ్యవసాయశాఖ అధికారి
వేసవికాలంలో రైతులు చెరువు పూడిక మట్టిని పంట చేనులో వేసుకోవడం ద్వారా భూసారం పెరుగుతుంది. రైతులు వేసవి దుక్కులు దున్నేటప్పుడు 6 నుంచి 7 అం గుళాలపైన నేల దున్నినట్లయితే భూసారం పెరుగు తుంది. పంట దిగుబడి అధికంగా ఉంటుంది. జీలుగ సాగు చేసుకోవడంతో భూమిలో పోషక విలువలు పెరుగుతాయి. 45 రోజుల్లో జీలుగ పూత దశకు వస్తుంది. భూమిలోనే దున్నేస్తే పచ్చరొట్ట ఏర్పడి భూసారం పెరుగుతుంది.