Share News

పెద్దపల్లి ‘హస్త’గతం

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:01 PM

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ హస్తగతమయ్యింది. బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్‌ అభ్యర్థి 1,31,771 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్‌ జెండాను ఎగుర వేసింది.

పెద్దపల్లి ‘హస్త’గతం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి/మంచిర్యాల)

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ హస్తగతమయ్యింది. బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్‌ అభ్యర్థి 1,31,771 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్‌ జెండాను ఎగుర వేసింది. ఇక్కడి నుంచి చివరి సారిగా కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తండ్రి ప్రస్తుత చెన్నూర్‌ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ డాక్టర్‌ వివేక్‌ గెలుపొందగా, తిరిగి ఆయన తనయుడు ఇక్కడి గెలుపొందడం విశేషం. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన బీఆర్‌ఎస్‌ పార్టీ హ్యాట్రిక్‌ సాధించాలని తహతహలాడినప్పటికీ మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. మూడో స్థానంలో నిలుస్తుందని అనుకున్న బీజేపీ అనూహ్యంగా గట్టి పోటినిచ్చి రెండో స్థానంలో నిలిచింది. మే 13వ తేదీన పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ జరగగా, మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని సెంటినగర్‌ కాలనీలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల, మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్‌లో గల ఐజా ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో లెక్కింపు ఆరంభించారు. 8:30 గంటలకు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఉన్న ఓట్లను లెక్కించడం ఆరంభించారు. మొత్తం 21 రౌండ్లలో లెక్కింపు జరిపారు. ఈ నియోజకవర్గంలో 15,96,430 ఓట్లకు గాను, 10,83,453 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు 4,80,994 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌కు 3,49,339 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు 1,94,821 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి 1,31,771 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొదటి నుంచి చివరి రౌండ్‌ వరకు, పోస్టల్‌ బ్యాలెట్లలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అధిక్యం కనబరిచారు

Updated Date - Jun 04 , 2024 | 11:01 PM