Kumaram Bheem Asifabad: పాఠశాలల ప్రారంభంలోగా పనులు పూర్తిచేయాలి
ABN , Publish Date - May 29 , 2024 | 09:49 PM
కాగజ్నగర్, మే 29: అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులను పాఠశాలల ప్రారంభంలోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం ఆయన పలు పాఠశాలలను పరిశీలించారు.
![Kumaram Bheem Asifabad: పాఠశాలల ప్రారంభంలోగా పనులు పూర్తిచేయాలి](https://media.andhrajyothy.com/media/2024/20240511/2_2_72b3b671c9.jpg)
- అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కాగజ్నగర్, మే 29: అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులను పాఠశాలల ప్రారంభంలోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం ఆయన పలు పాఠశాలలను పరిశీలించారు. పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై డీఈవో అశోక్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రతి రోజు మండల విద్యాధికారులు, మండల నోడల్ అధికారులు తమ పరిధిలో ప్రతిపాఠశాలను సందర్శించి పనుల పురోగతిపై దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట డీఈవో ఆశోక్, ఎంఈవో భిక్షపతి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మినరసింహం తదితరులు ఉన్నారు.
ఏకరూప దుస్తుల కేంద్రం పరిశీలన..
కాగజ్నగర్ నజ్రూల్నగర్లోని ఏకరూప దుస్తుల తయారీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారి బుధవారం పరిశీలించారు. పాఠశాల ప్రారంభంలోగా ప్రతి పాఠశాలకు ఏకరూప దుస్తులను పంపించాలని ఆదేశించారు. స్వయంసంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏక రూప దుస్తులను అప్ప జెప్పినట్టు తెలిపారు. దుస్తుల తయారీపై ప్రతిరోజు సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. ఆయ నవెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, సిబ్బంది ఉన్నారు.
గ్రూప్-1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి..
జూన్ 9న జరుగనున్న గ్రూపు-1 పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగేట్టు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ అన్నారు. గ్రూప్-1 కోసం కేటాయించిన పరీక్ష కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పరీక్ష కొరకు స్ట్రాంగ్ రూం నుంచి పరీక్ష పత్రాలు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వైద్యబృందాన్ని, ఓఆర్ఎస్ ప్యాకెట్ను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో వసుంధర కళాశాల నిర్వాహకులు, సిబ్బంది, పాల్గొన్నారు.