Kumaram Bheem Asifabad: సాగు భారం..
ABN , Publish Date - Apr 17 , 2024 | 10:42 PM
ఆసిఫాబాద్, ఏప్రిల్ 17: వ్యవసాయమే ప్రధాన జీవనధారమైన జిల్లాలో రోజురోజుకు సాగు భారం అధికమవుతోంది. యేటా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
![Kumaram Bheem Asifabad: సాగు భారం..](https://media.andhrajyothy.com/media/2024/20240413/asf_f_17_17_823ba54b5f.jpg)
- జిల్లాలో మొదలైన వేసవి దుక్కులు
- పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు
- పెట్టుబడి వ్యయం అధికమవుతుండడంతో రైతుల్లో ఆందోళన
ఆసిఫాబాద్, ఏప్రిల్ 17: వ్యవసాయమే ప్రధాన జీవనధారమైన జిల్లాలో రోజురోజుకు సాగు భారం అధికమవుతోంది. యేటా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో వానా కాలం పంటలసాగుకు చేలను సిద్ధం చేసే పనిలో రైతులు నిమగ్న మయ్యారు. ప్రస్తుతం వేసవిదుక్కుల పనులు జోరుగా సాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు విపరితంగా పెరిగిపోవడంతో సన్నకారు రైతుపై సాగు భారం మరింత పడుతోంది. ఇంధన డిమాండ్ భారీగా పెరుగడంతో ట్రాక్టర్ల కిరాయి పెరిగి పంటలు సాగు చేయడం కష్టమవుతోందన్న అభిప్రాయలు వక్తమవుతున్నాయి. ఏటేటా పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నా.. దానికి అను గుణంగా మద్దతు ధర పెరగకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
మండుతున్న ఇంధన రేట్లు..పెరుగుతున్న అద్దెలు..
జిల్లాలో ప్రస్తుతం వేసవి దుక్కుల పనులు ఊపందుకోవడంతో గ్రామాల్లో ట్రాక్టర్లు బిజీగా మారిపోయాయి. ఇందన ధరలకు అనుగుణంగానే ట్రాక్టర్ యజమానులు అద్దెలను పెంచేయడంతో అన్నదాతలపై అదనంగా భారం పడుతోంది. యేటా గంటకు రూ.100నుంచి రూ.200వరకు అద్దెలను పెంచే స్తున్నారు. డీజిల్ ధరలు పెరగడంతో తమకేమీ గిట్టుబాటు కావడం లేదని ట్రాక్టర్ యజమానులు పేర్కొంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసే విధంగా రైతులు సాగుపనుల్లో యంత్రాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రతి పనిని యంత్రాల సాయంతోనే చేపడుతున్నారు. ప్రస్తుతం ట్రాక్టర్లతో వేసవి దుక్కులు దున్నడం, పంట చేలను చదును చేయడం, చెరువులు, కుంటల నుంచి నల్లమట్టి, ఎరువులను తరలించడం, పత్తి కర్రను తొలగించడం లాంటి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
యేటా రూ.లక్షల్లో భారం..
ఇందన ధరలు పెరిగిపోవడంతో జిల్లా రైతాంగంపై యేటా లక్షల రూపా యల భారం పడుతోంది. దీంతో పంటలు సాగు చేయడం కష్టమేనన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మొత్తం 1,19,978 మంది రైతులు ఉండగా 4,50,000ఎకరాలలో ప్రతియేటా వివిధ పంటలను సాగు చేస్తు న్నారు. దుక్కి దున్నినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. నాలుగైదు సంవత్సరల క్రితం వరకు ఎకరానికి రూ.10నుంచి రూ.15వేల వరకు ఖర్చయ్యేది. కానీ ప్రస్తుతం రూ.20నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి వ్యయం అవుతోందని రైతులు వాపోతున్నారు. దీనికితోడు కూలీల కొరతతో యంత్రాల వినియోగం విపరీతంగా పెరిగి పోతోందంటున్నారు.
ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
-చిట్ల నారాయణ, రైతు, ఆసిఫాబాద్
సాగు పనుల ధరలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందన ధరలతో పాటు ఎరువులు, విత్తనాల ధరలు కూడా పెరగడంతో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. నాలుగైదు సంవత్సరల క్రితం వరకు ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15వేల ఖర్చయ్యేది. కానీ ప్రస్తుతం రూ.20వేల నుంచి రూ.30వేల వరకుపెట్టుబడి వ్యయం అవుతున్నది.