Kumaram Bheem Asifabad: శవ‘పరీక్ష’
ABN , Publish Date - Mar 12 , 2024 | 10:35 PM
వాంకిడి, మార్చి 12: అయిన వారు చనిపోయి కుంటుంబ సభ్యులు ఆవేదనలో ఉంటే.. శవపరీక్ష కోసం అంతకుమించిన యాతన అనుభవించాల్సి వస్తోంది. జిల్లాలో మరణాలు సంభవించినప్పుడు పోస్టుమార్టం అవసరమైతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
![Kumaram Bheem Asifabad: శవ‘పరీక్ష’](https://media.andhrajyothy.com/media/2024/20240306/asf_story_12_12_34eefcd2d1.jpg)
- పుట్టేడు దుక్కంలోనూ తప్పని నిరీక్షణ
- జిల్లాలో సిర్పూర్(టి), ఆసిఫాబాద్లోనే శవపరీక్ష కేంద్రాలు
- దూరభారంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
వాంకిడి, మార్చి 12: అయిన వారు చనిపోయి కుంటుంబ సభ్యులు ఆవేదనలో ఉంటే.. శవపరీక్ష కోసం అంతకుమించిన యాతన అనుభవించాల్సి వస్తోంది. జిల్లాలో మరణాలు సంభవించినప్పుడు పోస్టుమార్టం అవసరమైతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేవలం సిర్పూర్(టి), ఆసిఫాబాద్లోనే పోస్టుమార్టం కేంద్రాలు ఉండడంతో ఆయా కేంద్రాలకు రావాలంటే మిగతా మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుట్టెడు దుఃఖంలో పోస్టుమార్టం కోసం మృతేదేహాన్ని తీసుకెళ్లాల్సి వస్తోంది. తిరిగి పోస్టుమార్టం అనంతరం ఇంటికి తీసుకెళ్లే సరికి ఎంతో సమయం పడుతోంది. ఇలా జిల్లాలోని ప్రజలు సమీపంలో పోస్టుమార్టం కేంద్రం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనుమానాస్పద స్థితిలో మృతిచెందితే శవపరీక్ష చేయించేందుకు బాధిత కుటుంబ సభ్యులకు కష్టాలు తప్పడంలేదు. నిరుపేదలకు రానుపోను వాహన ఖర్చులతోపాటు శవపరీక్ష సమయంలో వైద్యసిబ్బందికి ఇచ్చే ఖర్చులు తలకు మించిన భారం అవుతోంది. మారుమూల గ్రామాల నుంచి శవపరీక్ష కోసం సిర్పూర్(టి) కు వెళ్లాలంటే ఆ ప్రాంత ప్రజలకు రానుపోను 100కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే ఆసిఫాబాద్ వెళ్లాలంటే ఈ ప్రాంతం వారికి రానుపోను 30 నుంచి 40కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడం, తీరా వెళ్లాక అక్కడ గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అనుకోకుండా సాయంత్రం 6గంటల తరువాత శవపరీక్ష కోసం వెళ్తే మరుసటి రోజు వరకు మృతుడి బంధువులు వేచి ఉండాల్సి ఉంటుంది. మృతదేహాలను మార్చురీకి తరలించే వాహనాలకు సాధరణంగా అధిక డిమాండ్ ఉంటుంది. దూరం ఎక్కువయితే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. శవపరీక్ష పూర్తి చేసుకొని వచ్చేసరికి ఎక్కువ సమయం పడుతుండడంతో అంత్యక్రియలకు ఆలస్యం అవుతుంది. ఇది బాధిత కుటుంబాలకు మరింత ఆవేదన కలిగిస్తోంది.
- ఏజెన్సీ ప్రాంత వాసులకు తప్పని ఇబ్బదులు..
ఆసిపాబాద్ నియోజకవర్గంలోని ఏజెన్సీ మండలాలు లింగాపూర్, జైనూర్, సిర్పూర్(యు) నుంచి పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు సివిల్ ఆసుపత్రికి వెళ్లాలి. ఈ మండలాల ప్రజలు ఉట్నూర్ సామాజిక ఆసుపత్రికి వెళ్లాలంటే 50కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. రెబ్బెన, వాంకిడి, కెరమెరి, తిర్యాని మండలాల నుంచి పోస్టుమార్టం కోసం ఆసిఫాబాద్ సామాజిక ఆసుపత్రికి తీసకువెళ్లాలంటే 30నుంచి 40 కిలోమీటర్లు దూరభారం అవుతుంది. వాంకిడి పాత తాలుకా కేంద్రం ఉన్నప్పుడు వాంకిడి ఆసుపత్రిలోనే పోస్టుమార్టం కేంద్రం ఉండేది. మండ లాల ఏర్పాటు తరువాత ఇక్కడి నుంచి పోస్టుమార్టం కేంద్రాన్ని తీసివేశారు. జిల్లాలోని పలు మారుమూల మండలాలకు సీహెచ్సీ సౌకర్యం కల్పించి శవపరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాధిత కుటుంబాలకు ఇబ్బందులు తప్పుతాయి.
సిర్పూర్(టి) నియోజకవర్గం ప్రజలకు ఇబ్బందులే..
సిర్పూర్(టి) నియోజకవర్గంలోని దహెగాం, బెజ్జూర్, చింతలమానేపల్లి, పెంచికల్పేట్, కౌటల మండలాల మారుమూల ప్రాంతాల నుంచి సిర్పూర్ (టి) మార్చురీకి వెళ్లాలంటే దాదాపు 100కిలోమీటర్లు దూరం అవుతుంది. రానుపోను 200కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. మృతదేహాలను తీసు కెళ్లేందుకు ప్రైవేటు వాహనాలవారు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడం, మార్చురీలో సకాలంలో పోస్టుమార్టం జరగకపోవడంతో ఒకపక్క శవపరీక్ష కోసం నిరీక్షించడమే కాకుండా ఆర్థికభారంతో నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి.
ఫ వాంకిడి, కౌటాల, జైనూరుల్లో శవపరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి
- బండే తుకారాం, మాజీ సర్పంచు, వాంకిడి
జిల్లాలోని కౌటాల, జైనూర్, వాంకిడి మండలాల్లో శవపరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తే సమీప మండలాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కౌటాలలో శవపరీక్ష ఏర్పాటు చేస్తే చింతలమానేపల్లి, బెజ్జూరు, పెంచికల్పేట మండలాల వారికి దూరభారం తగ్గుతుంది. అదేవిధంగా వాంకిడి, జైనూర్ లలో ఏర్పాటు చేస్తే ఏజెన్సీ గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. పాత తాలుకా కేంద్రం ఉన్నప్పుడు వాంకిడిలో శవపరీక్ష కేంద్రం ఉండేది. మండలాల ఏర్పాటు తరువాత ఇక్కడి నుంచి తీసివేశారు. బాధితులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం శవపరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలి.