జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు
ABN , Publish Date - Apr 19 , 2024 | 10:40 PM
జిల్లాలో ఎండలు మండిపోతు న్నాయి. సూర్య ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావా లంటేనే జనం జంకుతున్నారు. ముఖ్యంగా పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటుండటంతో ఎండ వేడిమిని తాళలేక పోతున్నారు.
మంచిర్యాల, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండిపోతు న్నాయి. సూర్య ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావా లంటేనే జనం జంకుతున్నారు. ముఖ్యంగా పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటుండటంతో ఎండ వేడిమిని తాళలేక పోతున్నారు. వారం రోజులుగా విపరీతమైన ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. నాలుగైదు రోజులుగా జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు నమో దవుతోంది. రెండు రోజులుగా సాయంత్రం 4 గంటల తర్వాత వాతావర ణం మబ్బులు పడుతుండటంతో ఎండ వేడిమి తగ్గి కొంతమేర ఉప శమనం కలుగుతోంది.
క్రమేపీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
జిల్లాలో వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా పగటి వేళలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుం డగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడం ఆందోళనకు రేకెత్తిస్తోంది. జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి ఏరియాల్లో అండర్ గ్రౌండ్ బొగ్గు బావులతోపాటు ఓపెన్కాస్టు మైన్లు అధిక సంఖ్యలో ఉండడంతో ఇక్కడి వాతావరణం తీవ్రంగా వేడుక్కుతోంది. చిన్న చిన్న అవసరాలకు కూడా బయటకు వెళ్లలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కపోతకు గురవుతుం డగా సామాన్య జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాల పై బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి.
బొగ్గు గనుల్లో పరిస్థితి దయనీయం
క్రమేపీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సెకండ్ షిఫ్ట్లో విధుల్లోకి వెళ్లే కార్మికులు ఎండల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. మొదటి షిఫ్టు పూర్తి చేసుకున్న వారు సైతం మండుటెండలో ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది. సాధారణ ప్రాంతాలతో పోల్చితే బొగ్గు గనులు ఉన్న ఏరియాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్ కాస్టు గని కార్మికులు ఎండవేడికి కుదేలవుతున్నారు. దీంతో పని వేళల్లో మార్పులు చేయాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. గతంలో వేసవి ఎండలకు సింగరేణిలో పనివేళల్లో మార్పులు చేసేవారు. పదేళ్లుగా ఆ పద్ధ తికి స్వస్తి పలకడంతో కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణ రోజుల్లో ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 6 నుంచి మఽధ్యాహ్నం 2 గంటల వరకు, సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. అయితే ఎండలు పెరిగినప్పుడు పై రెండు షిఫ్టుల్లో పని వేళలను యాజ మాన్యం గంట ముందుకు మార్చేది. అలా ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 5 నుంచి మఽధ్యాహ్నం ఒంటి గంట వరకు, రెండో షిఫ్ట్ను సాయంత్రం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు మార్పులు చేసేవారు. దీంతో ఎండవేడి నుంచి కార్మికులు ఉపశమనం పొందేవారు. గతంలోలాగే పని వేళల్లో మార్పులు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
వారం రోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
జిల్లాలో గడిచిన వారం రోజుల్లో నమోదైన ఉష్ణోగతల వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 11న 40 డిగ్రీలు, 12న 35.9 డిగ్రీలు, 15న 42.6 డిగ్రీలు, 16న 42.9 డిగ్రీలు, 17న 44 డిగ్రీలు, 18న 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం భీమారం మండలంలో 44.9 డిగ్రీలు, నస్పూరు మండలంలో 44.5 డిగ్రీలు, బెల్లంపల్లి మండలంలో 44.4 డిగ్రీలు, జన్నారం మండలంలో 44.2 డిగ్రీలు, కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో 44.1 డిగ్రీలు, కోటపల్లి మండలంలో 44.1 డిగ్రీలు, జైపూర్ మండలంలో 43.9 డిగ్రీలు, వేమనపల్లి మండలంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.