రుణమాఫీపై దరఖాస్తుల వెల్లువ
ABN , Publish Date - Aug 23 , 2024 | 10:16 PM
రుణమాఫీ కానీ రైతులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అన్ని అర్హతలుండి రుణమాఫీ కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. మూడు విడుతల్లో రుణం ఎందుకు మాఫీ కాలేదో తెలియక ఆవేదన చెందుతున్నారు. సాగు పనులు వదులుకొని బ్యాంకులు, వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లో ఆర్జీలు పెట్టుకుంటున్నారు.
నెన్నెల, ఆగస్టు 23: రుణమాఫీ కానీ రైతులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అన్ని అర్హతలుండి రుణమాఫీ కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. మూడు విడుతల్లో రుణం ఎందుకు మాఫీ కాలేదో తెలియక ఆవేదన చెందుతున్నారు. సాగు పనులు వదులుకొని బ్యాంకులు, వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లో ఆర్జీలు పెట్టుకుంటున్నారు. రుణమాఫీ కాని రైతులు వేల సంఖ్యలో ఉండడంతో దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి.
- పలు కారణాలతో పెండింగ్
చిన్నచిన్న పొరపాట్లతో చాలా మంది రైతులు పంట రుణమాఫీకి దూరమయ్యారు. కొందరికి సాంకేతిక సమస్యలతో మాఫీ కాలేదు. ఆహార భద్రత కార్డు ఉండి రూ.2 లక్షల లోపు రుణం ఉన్న రైతుల్లో సైతం మాఫీ కానివారున్నారు. కుటుంబంలో ఒక్కరే రుణం తీసుకున్నా.. ధరణి రికార్డు ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డుతో బ్యాంకు లింకేజీ, ఈ కేవైసీ అప్డేట్ ఉండి కూడా రుణం మాఫీ కాలేదని వాపోతున్నారు. కుటుంబ సభ్యుల పేరిట రూ.రెండు లక్షల పైన రుణం ఉన్న వారికి కూడా పథకం వర్తించక పోవడంతో అయోమయంలో ఉన్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేదని చెబుతూనే కార్డు లేని వారికి రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయలేదు. కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారని అధికారులు చెబుతున్నారు. నిర్ధారణ చేసేది ఎప్పుడో మాఫీ అయ్యేది ఎప్పుడో తెలియడం లేదని రైతులంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులం దరూ రుణమాఫీకి అర్హులవుతారు. కాని పీఎం కిసాన్ వస్తున్న రైతుల్లో చాలా మందికి రుణమాఫీ కాలేదు. పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ లేక పోవ డంతో అధికారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆధార్కార్డు నంబరు సరి చేసే ఆప్షన్ కూడా లేదని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆర్జీలను తీసుకోవడం వరకే తమ బాధ్యతగా చెబుతున్నారు.
-రూ. 2 లక్షలకు పైబడి రుణం ఉంటే ఎలా...
రెండు లక్షల వరకు రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయగా, ఆ పైబడిన రైతుల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. రైతు పేరిట రుణం ఎంత ఉన్నా రూ.2 లక్షలకు మాఫీ చేస్తారని రైతులు భావించారు. కాని రూ.2 లక్షల రుణం తీసుకున్న రైతులు వడ్డీతోపాటు ఆపై ఉన్న డబ్బులను బ్యాంకులో చెల్లిస్తే రూ.2 లక్షలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారని అధి కారులంటున్నారు. ఈ నిబంధనపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. రుణం ఎంత ఉన్న రూ.2 లక్షలు మాఫీ చేస్తే ఎలాంటి సమస్య ఉండదని రైతులు అభిప్రాయ పడుతున్నారు.
-మూడు విడతల్లో రుణమాఫీ ఇలా..
ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన మూడు విడతల్లో జిల్లాలోని 53,442 మంది రైతులకు రుణమాఫీ కింద రూ.465 కోట్ల 17 లక్షల 59 వేల 201లు వివిధ బ్యాంకుల్లో జమ అయ్యాయి. మొదటి విడతలో లక్ష రూపాయల లోపు రుణాలున్న 28,749 మంది రైతులకు రూ.151 కోట్ల 27 లక్షల 19 వేల 035లు మాఫీ అయ్యాయి. రెండో విడతలో రూ.లక్షన్నర జాబితాలో 14,104 మంది రైతులకు రూ. 175కోట్ల 43 లక్షల 83 వేల 912లు మాఫీ అయ్యాయి. మూడో విడతలో రెండు లక్షల లోపు రుణం ఉన్న 10,611 మంది రైతులకు రూ.175 కోట్ల 43 లక్షల 83 వేల 912లు ఖాతాల్లో జమ అయ్యాయి.
-కేసీసీ బ్యాలెన్స్తో నష్టపోయిన రైతులు
గత ప్రభుత్వం రుణమాఫీ చేసి ఖాతాలో జమ చేసిన డబ్బులను డ్రా చేసుకోకుండా బ్యాంకులోనే నిల్వ ఉన్న రైతులు నష్టపోయారు. రుణ ఖాతానే కదా కొంతలో కొంతైన అప్పు తీరినట్టు అవుతుందని అందులోనే నిల్వ ఉన్న వారికి ఆ సొమ్ము మినహాయించుకొని మిగతా జమ చేశారు. ప్రభుత్వం బ్యాంకర్ల నుంచి వివరాలు తీసుకునే సమయంలో ఔట్ స్టాండింగ్ నిల్వలు చూపడంతో రైతులకు బ్యాలెన్స్ పోనూ మిగతా డబ్బు మాత్రమే జమ అయిందని బ్యాంకర్లు అంటున్నారు. ఎప్పటికప్పుడు డబ్బులు డ్రా చేసుకున్న వారు లబ్ధి పొందగా, నిల్వ ఉంచుకున్న వారు మాత్రం నష్టపోయారు.
-రైతుల ఆందోళన బాట
పంట రుణం మాఫీ కాకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకు లకు వెళ్లి అధికారులను నిలదీస్తున్నారు. రెండు రోజుల కిందట నెన్నెల మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రుణం తీరలేదని మనస్తాపంతో ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతున్నారు.