Share News

కౌలు రైతుకు సాయం అందేనా?

ABN , Publish Date - Jan 05 , 2024 | 10:49 PM

ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించే కౌలు రైతులను ఆదుకుంటామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. వారికి యేటా రూ.15 వేలు చెల్లిస్తామని పేర్కొంది. వారికి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

 కౌలు రైతుకు సాయం అందేనా?

మంచిర్యాల, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించే కౌలు రైతులను ఆదుకుంటామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. వారికి యేటా రూ.15 వేలు చెల్లిస్తామని పేర్కొంది. వారికి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. భూములు లేని పేద రైతులకు ఇన్నాళ్లు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు వారిని ఆదుకునేందుకు మార్గం సుగమం అవుతోంది. చీడపీడల కారణంగా పంటలు దెబ్బతిన్నా, చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు, ఇతరత్రా ప్రకృతి విపత్తులతో నష్టపోయినా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భూ యజమానికి కౌలు చెల్లించాల్సిందే. కాంగ్రెస్‌ హామీ అమలైతే కౌలు రైతులకు మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

యేటా పెరుగుతున్న కౌలు రేట్లు

కౌలు రేట్లు యేటా పెరుగుతుండటంతో రైతులపై అధిక భారం పడుతోంది. ప్రస్తుతం నీటి వసతులు ఉన్నచోట ఎకరా భూమికి సంవత్సరానికి రూ.15వేల పైచిలుకు పలుకుతోంది. నీటి వసతులు తక్కువగా ఉన్నచోట రూ.10వేల నుంచి 12వేల వరకు యజమానులు వసూలు చేస్తున్నారు. పదేళ్ళలో కౌలు రేట్లను పరిశీలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగాయి. 2010లో ఎకరాకు రూ.3 వేలు ఉన్న కౌలు భూముల ధరలు, 2022లో రూ.15వేలు ఉండగా 2023లోనూ అదే మాదిరిగా కౌలు రేట్లు వసూలు చేశారు. పంటతో సంబంధం లేకుండా అగ్రిమెంటు ప్రకారం భూముల యజమానులకు కౌలు రైతులు పై రేట్లు చెల్లించాల్సి వస్తోంది.

పెట్టుబడులూ అధికమే

పంటలు పండించేందుకు కౌలు రైతులు పెట్టే పెట్టుబడులు సైతం అధికంగానే ఉంటున్నాయి. సరాసరి ఎకరా విస్త్రీర్ణం సాగు కోసం దున్నేందుకు ట్రాక్టర్‌ కిరాయి రూ.6 వేలు వెచ్చించాల్సి వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. అలాగే నాటు వేయడానికి రూ.4 వేలు, ఎరువుల కోసం రూ.8 వేలు, కలుపు తొలగించేందుకు రూ.3 వేలు, పంట సమయంలో కోత మెషీన్‌కు గంటన్నరకు రూ.3000 చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఎకరా సాగు చేసేందుకు రైతులు సరాసరి రూ.21 వేలకుపైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడులు యేటా పెరుగుతుండటంతో కౌలు రైతు అధిక భారం మోయక తప్పడంలేదు. గతేడాది రూ.6 వేలు ఉన్న ట్రాక్టర్‌ కిరాయి ఈయేడు వెయ్యి రూపాయల వరకు పెరిగింది. ఎరువుల ధరలు సరాసరి రూ. 2వేల వరకు పెరిగినట్లు రైతులు వాపోతున్నారు. 2017 వరకు జిల్లాలో 300 మంది కౌలు రైతులు ఉండగా 172 మందికి ప్రభుత్వపరం గా గుర్తింపు కార్డులు అందజేశారు. రూ.3 లక్షల వరకు రుణం మంజూరు చేశారు. అనంతరం కౌలు రైతు గుర్తింపు కార్డులను ప్రభుత్వం రద్దు చేయగా బ్యాంకులు రుణాలు నిలిపి వేశాయి. పంట పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నిలువు దోపిడీకి గురవుతున్నారు.

చట్టాలు చచ్చుబండలు

కౌలు రైతులకు ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ లైసెన్స్‌డ్‌ కల్టివేటర్స్‌ రూల్స్‌-2012 చట్టం అమల్లో ఉండేది. అయితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావడంతో చట్టం కనుమరుగైంది. 2016-17 వరకు చట్టాన్ని అమలు చేసిన ప్రభుత్వం అనంతరం పట్టించుకోవడంలేదు. చట్టంలో భాగంగా రెవెన్యూ అధికారులు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసేవారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద రైతుల వివరాలు నమోదు చేసే వారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందేవి. క్రాపు లోన్‌ మినహాయించి ఇతరత్రా రుణాలు పొందేందుకు ఉపయోగపడేవి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కౌలు రైతుల గుర్తింపును రద్దు చేయడంతో ప్రభుత్వపరంగా వీరికి ఎలాంటి సహాయ సహకారాలు అందడంలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణమాఫీ ప్రకటించి, రైతుబంధు కింద ఎకరానికి యేటా రూ.8వేలు అందించినా భూ యజమానికే తప్ప కౌలు రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, తమనూ రైతుబంధు పథకం పరిధిలోకి తెచ్చి, పెట్టుబడి సాయం అందజేయాలని కౌలు రైతులు విజ్ఞప్తి చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఆత్మహత్యలే శరణ్యమని

అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 3వేల మంది కౌలు రైతులు ఉన్నారు. పంట దిగుబడిరాక, అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కోటపల్లి మండలం పుల్లగామకు చెందిన కౌలు రైతు కామ లింగయ్య (51) పత్తి పంట ప్రాణహిత వరదల్లో మునిగి నష్టం వాటిళ్లగా 2022 సెప్టెంబరు 20న ఆత్మహత్య చేసుకొన్నాడు. భీమారం మండలం కొత్తపల్లికి చెందిన దుర్గం శ్రీనివాస్‌ (27) నాలుగెకరాలను కౌలుకు తీసుకొని పత్తి సాగు చేయగా అధిక వర్షాల కారణంగా దిగుబడి రాక అక్టోబర్‌ 27న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాండూరు మండలం రేపల్లె వాడకు చెందిన పెద్దపల్లి లక్ష్మి (41) అనే కౌలు రైతు భార్య పంట దిగుబడి తగ్గి నవంబరు 16న పురుగుల మందు తాగగా 18న మృతి చెందింది. అదే నెల 29న కాసిపేట మండలం కొండాపూర్‌ చెందిన కొమిరె కనకయ్య (39) పంట దిగుబడి రాక బలవంతపు మరణానికి పాల్పడ్డాడు. లక్షెట్టిపేట మండలం చందా రంలో పంట దిగుబడి రాక డిసెంబరు 11న పురుగుల మందు తాగి ఆకుల మల్లయ్య (45) అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకోగా, కన్నెపల్లి మండలం జనకాపూర్‌ చెందిన కౌలు రైతు మేడి శ్రీనివాస్‌ (40) అదే నెల 12న తనువు చాలించాడు.

Updated Date - Jan 05 , 2024 | 10:49 PM