Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Google: కేంద్రం జోక్యంతో.. ఆ యాప్‌ల విషయంలో గూగుల్ యూటర్న్!

ABN , Publish Date - Mar 02 , 2024 | 08:25 PM

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ (Google) తన ప్లే స్టోర్ (Google Play Store) నుంచి భారత్‌కు చెందిన కొన్ని యాప్‌లను (Indian Apps) తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. సర్వీస్ ఫీజు వివాదం నేపథ్యంలో.. శుక్రవారం భారత్ మ్యాట్రిమోనీ (Bharat Matrimony), నౌక్రీ‌తో (Naukri) పాటు పది కంపెనీలకు చెందిన యాప్‌లను తీసేసింది.

Google: కేంద్రం జోక్యంతో.. ఆ యాప్‌ల విషయంలో గూగుల్ యూటర్న్!

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ (Google) తన ప్లే స్టోర్ (Google Play Store) నుంచి భారత్‌కు చెందిన కొన్ని యాప్‌లను (Indian Apps) తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. సర్వీస్ ఫీజు వివాదం నేపథ్యంలో.. శుక్రవారం భారత్ మ్యాట్రిమోనీ (Bharat Matrimony), నౌక్రీ‌తో (Naukri) పాటు పది కంపెనీలకు చెందిన యాప్‌లను తీసేసింది. అయితే.. ఈ విషయంలో కేంద్రం (Central Govt) జోక్యం చేసుకోవడంతో, గూగుల్ సంస్థ ఆ యాప్‌లను పునరుద్ధరించే పనిలో నిమగ్నమైంది. ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో (Ashwini Vaishnav) కంపెనీ అధికారులు సమావేశమైన తర్వాత.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.


కాగా.. గతంలో గూగుల్ సంస్థ యాప్‌ల నుంచి 15 నుంచి 30 శాతం వరకు ఛార్జీలను వసూలు చేసేది. నియంత్రణ సంస్థల ఆదేశాల అనంతరం గూగుల్ 11 నుంచి 26 శాతం రుసుము విధించింది. దీనిపై భారతీయ స్టార్టప్ కంపెనీలు (Indian Startups) అభ్యంతరం తెలిపాయి. యూఎస్ టెక్ దిగ్గజం (Google) అన్యాయమైన విధానాల్ని అనుసరిస్తోందని నిరసన వ్యక్తం చేశాయి. ఏదేమైనా.. చార్జీల విధింపు, యాప్‌ల తొలగింపు విషయంలో గూగుల్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల తీర్పునిచ్చింది. ఈ తరుణంలోనే.. ప్లే స్టోర్‌ నిబంధనల ఉల్లంఘనపై గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ (Alphabet) నోటీసులు పంపగా, తాము ఇంకా పరిస్థితిని పరిశీలిస్తున్నామని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ఇంతలోనే గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి ఆ యాప్‌లను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా మ్యాట్రిమోనీ.కామ్‌ ఫౌండర్‌ మురుగవేల్‌ జానకీరామన్‌ (Murugavel Janakiraman) మాట్లాడుతూ.. ప్లే స్టోర్ నుండి యాప్‌లను తొలగిస్తున్నారని, ఇది మ్యాట్రిమోనీ సేవలపై విస్తృతంగా ప్రభావం చూపే అవకాశం ఉందని, భారతదేశ ఇంటర్నెట్‌కు ఇది చీకటి రోజు అని పేర్కొన్నారు. ఈ తరుణంలోనే ఐటీ శాఖ మంత్రి వైష్ణవ్ రంగంలోకి దిగి.. భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను రక్షించాల్సిన అవసరం ఉందని, అదే విషయాన్ని గూగుల్‌కు తెలియజేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. గూగుల్ సహేతుకంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు గూగుల్ ప్రతినిధులతో కలిసిన తర్వాత.. సమస్య పరిష్కారం అయినట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. త్వరలోనే ఈ యాప్స్ ప్లే స్టోర్‌లోకి వచ్చేస్తాయని సమాచారం.

Updated Date - Mar 02 , 2024 | 08:25 PM