Vizag Test: మహ్మద్ సిరాజ్ను పక్కన పెట్టండి.. మరో బ్యాట్స్మెన్ను తీసుకోండి.. పార్థివ్ సలహా!
ABN , Publish Date - Jan 30 , 2024 | 07:07 PM
హైదరాబాద్లో ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలు కావడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. పలువురు మాజీ ఆటగాళ్లు ఇప్పటికే రోహిత్ సేన ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు
హైదరాబాద్లో ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలు కావడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది (India vs England). పలువురు మాజీ ఆటగాళ్లు ఇప్పటికే రోహిత్ సేన ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైజాగ్లో జరగబోతున్న రెండు టెస్ట్కు (Vizag Test Match) ముందు జట్టు కూర్పుపై మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel) ఓ సలహా ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్కు (Mohammed Siraj) తుది జట్టులో స్థానం కల్పించడం ఎందుకని ప్రశ్నించాడు. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్ట్లో సిరాజ్ చేత 11 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించడంపై విమర్శించాడు.
``ప్రధాన బౌలర్ అయిన సిరాజ్ చేత కేవలం 11 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయిస్తారా? స్వంత మైదానంలో ఆడుతున్న సిరాజ్ను ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు. ఒక బౌలర్కు 11 ఓవర్లు మాత్రమే ఇచ్చినప్పుడు అతడిని ఆడించడంలో అర్థం లేదు. సిరాజ్ను ఉపయోగించుకోవడం తెలియనప్పుడు అతడిని ఎందుకు తీసుకున్నారు. సిరాజ్ బదులు అదనపు బ్యాటర్ను తీసుకోవాల్సింది`` అని వ్యాఖ్యానించాడు. తొలి టెస్ట్లో మొత్తం 11 ఓవర్లు వేసిన సిరాజ్ మొత్తం 50 పరుగులిచ్చాడు. ఒక వికెట్ కూడా తీసుకోలేకపోయాడు.
``ముగ్గురు స్పిన్నర్లతో ఆడడం మంచి నిర్ణయమే. బ్యాటింగ్ కూడా చేయగలడని అక్షర్ను తీసుకుని ఉండవచ్చు. కానీ, అక్షర్కు బదులు కుల్దీప్ను తీసుకోవడం ఉత్తమం. అప్పుడు జడేజా, అశ్విన్, కుల్దీప్ రూపంలో మూడు వైవిధ్యమైన స్పిన్నర్లు ఉంటారు. సిరాజ్ స్థానంలో మరో బ్యాటర్ను తీసుకుంటే బ్యాటింగ్ విభాగం బలోపేతమవుతుంద``ని పార్థివ్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం నుంచి విశాఖపట్నంలో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.