Share News

Investment: రోజూ రూ.100 మదుపు చేస్తే కోటీశ్వరులైపోతారా? ఇందులో నిజమెంత?

ABN , Publish Date - Jan 27 , 2024 | 05:56 PM

మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలి? ఆర్థిక లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలంటే ఏం చేయాలి? అనే విషయాల్లో నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు.

Investment: రోజూ రూ.100 మదుపు చేస్తే కోటీశ్వరులైపోతారా? ఇందులో నిజమెంత?

ఇంటర్నెట్ డెస్క్: స్టాక్ మార్కెట్లు..ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో (Mutual Funds) పెట్టుబడులకు (Investment) సంబంధించి అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఆదాయంలో 30 శాతం మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించాలని కొందరు అంటారు. రోజూ రూ.100 చొప్పున పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో కోటీశ్వరులైపోవచ్చని ఇంకొందరు చెబుతుంటారు. అయితే, మ్యూచువల్ ఫండ్స్‌ను ఇలాంటి కోణాల్లో చూడటం సబబు కాదని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్టుబడి సాధనాలకంటే మ్యూచువల్ ఫండ్స్ ఎంతో మెరుగైనవని నిపుణులు చెబుతున్నారు. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతో అనువైనవి. దీర్ఘకాలిక (5 ఏళ్లకు పైబడి) పోర్ట్‌ఫోలియోల్లో మొత్తం మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా కూడా సబబేనని చెబుతున్నారు. ప్రస్తుతం 3 వేలకు పైగా పథకాలు ఉన్నాయి కాబట్టి అవసరానికి తగిన దాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంది. అయితే, ఈ పెట్టుబడి సాధనాల్లో రిస్క్ ఎంత? ప్రతిఫలం ఎంత? అనే విషయాల్లో పూర్తి అవగాహన ఉండాలి. లేకపోతే స్టాక్‌మార్కెట్ ప్రయాణం ఆరంభంలోనే తలకిందులవుతుంది.

అనుభవజ్ఞులు చెప్పే దాని ప్రకారం, సరైన మ్యూచువల్ ఫండ్స్ పథకం ఎంచుకుంటే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా 2 నుంచి మూడు రెట్ల ఆదాయం రావచ్చు.


ఇక మ్యూచువల్ ఫండ్స్‌లోనే పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఎంత మొతాన్ని ఇన్వెస్ట్ చేయబోతున్నారనే అంశంపై కూడా క్లారిటీ ఉండాలి. ఎంతో కొంత ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే అవసరాలకు తగిన రాబడి ఉండదనేది నిపుణుల హెచ్చరిక. ఇలాంటి పెట్టుబడుల్లో స్థిరత్వం కూడా ఉండదని అంటున్నారు. కాబట్టి, పెట్టుబడి లక్ష్యం ఏమిటి? ఎంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలి? అనే విషయాల్లో స్పష్టత ఉండాలి.

మనకున్న లక్ష్యాన్ని బట్టి పెట్టుబడి మొత్తం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుత పరిస్థితుల్లో టాప్ కాలేజీల్లో ఎంబీయే చదవడానికి రూ.10 లక్షల ఖర్చు అవుతుందని అనుకుందాం. ఇక ద్రవ్యోల్బణం కూడా పరిగణనలోకి తీసుకుంటే 2040 నాటికల్లా ఈ ఖర్చు రూ.35 లక్షలకు చేరుకోవచ్చు. కాబట్టి.. క్రమానుగత పెట్టుబడుల్లో (ఎస్ఐపీ) నెలకు రూ.4 వేలు చొప్పున మదుపు చేస్తే ఈ లక్ష్యాన్ని సులువుగానే చేరుకోవచ్చు. అయితే, భవిష్యత్తు అవసరాలు ఏంటి? ఏయే సాధనాల్లో ఎంత మదుపు చేయాలి? అనే విషయాల్లో ఫైనాన్షియల్ ప్లానర్ సలహాలు తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

పెట్టుబడిదారులకు క్రమశిక్షణ, సంయమనం కూడా కీలకమని నిపుణులు చెబుతున్నారు. కూడబెట్టిన మొత్తాన్ని లక్ష్యానికి మినహా మరే ఇతర అవసరానికీ వాడొద్దని అంటున్నారు. అత్యవసర సందర్భాల్లో తప్ప ఈ మొత్తాన్ని వెనక్కు తీసుకోకూడదు. కాబట్టి, మార్కెట్ ప్రకటనల హోరు, హడావుడితో మోసపోకుండా పూర్తి అవగాహనతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే అనుకున్న లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు.

Updated Date - Jan 27 , 2024 | 06:04 PM