Share News

AP Assembly Elections: ఎన్నికల కమిషన్ బిగ్ ట్విస్ట్.. ఏపీలో కూటమికి కొత్త తలనొప్పి..!!

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:42 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ (TDP-Janasena-BJP) కలిసి కూటమిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. మేనిఫెస్టోపై (Manifesto) కసరత్తు పూర్తి కావడంతో మంగళవారం (ఏప్రిల్-30న) రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. అభ్యర్థుల ప్రకటన, నామినేషన్లు, ఉపసంహరణ.. ఎన్నికల ప్రచార జోరు అన్నీ సవ్యంగా సాగుతున్న టైమ్‌లో కూటమికి కొత్త తలనొప్పి వచ్చిపడింది..

AP Assembly Elections: ఎన్నికల కమిషన్ బిగ్ ట్విస్ట్.. ఏపీలో కూటమికి కొత్త తలనొప్పి..!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) టీడీపీ, జనసేన, బీజేపీ (TDP-Janasena-BJP) కలిసి కూటమిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. మేనిఫెస్టోపై (Manifesto) కసరత్తు పూర్తి కావడంతో మంగళవారం (ఏప్రిల్-30న) రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. అభ్యర్థుల ప్రకటన, నామినేషన్లు, ఉపసంహరణ.. ఎన్నికల ప్రచార జోరు అన్నీ సవ్యంగా సాగుతున్న టైమ్‌లో కూటమికి కొత్త తలనొప్పి వచ్చిపడింది.ఈ ఎన్నికల్లో పలు చోట్ల రెబల్స్, ఇండిపెండెంట్లుగా పోటీచేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు గాజు గ్లాస్ (Glass Symbol) గుర్తును కేటాయించడంతో కూటమిలో గందరగోళం నెలకొన్నట్లయ్యింది. కూటమి సీట్ల పంపకంలో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 02 పార్లమెంట్ స్థానాలను కేటాయించడం జరిగింది. అయితే.. ఈ పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాస్‌పై మొదట్నుంచీ వివాదమే నడుస్తుండగా.. న్యాయస్థానాల తీర్పులతో రిలీఫ్ అయినప్పటికీ ఇప్పుడు రెబల్స్, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇదే గుర్తును కేటాయించడం గమనార్హం. ఒక్క మాటలో చెప్పాలంటే కూటమికి గాజు గ్లాసు గండం వెంటాడుతోందన్న మాట.


Glass-Symbol.jpg

ఎందుకిలా..?

జనసేనకు మాత్రమే గాజు గ్లాసు కేటాయించగా.. ఫ్రీ సింబల్ జాబితాలో ఎన్నికల కమిషన్ పెట్టడం గమనార్హం. పైగా.. జనసేన పోటీలో లేని చోట ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్ గుర్తు ఉండటంతో కూటమి నేతలు తలలుపట్టుకున్న పరిస్థితి. నిజంగా ఇది బిగ్ ట్విస్టే అని చెప్పుకోవచ్చు. ఈదెబ్బతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ కొందరికి ఈ గుర్తులను ఈసీ కేటాయించగా.. మరికొందరికి కేటాయించే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. అదీ టీడీపీ, బీజేపీ అభ్యర్థులున్న చోట అయితే పెద్ద తలనొప్పే.! జనసేనకు గుర్తింపు లేకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే.. టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందన్నది ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట. ఎందుకంటే.. స్వతంత్ర అభ్యర్థికి కూడా గ్లాసు గుర్తు కేటాయిస్తే.. జనసేన అభ్యర్థి అనుకొని ఓట్లు వేసే అవకాశాలు కచ్చితంగా ఉంటాయి. దీంతో న్యాయస్థానానికి వెళ్లడానికి కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి నిమిషంలో ఏదైనా మార్పులు, చేర్పులు చేసే అవకాశం వస్తే బాగుటుందని కూటమి ఆశాభావం వ్యక్తం చేస్తోంది.


Alliance-Leaders.jpg

ఇప్పటి వరకూ ఇలా..!

ఇదిలా ఉంటే.. గాజు గ్లాసు గుర్తు జనసేన అభ్యర్ధులకు మాత్రమే కేటాయిస్తామని ఆదివారం నాడు ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ.. కొందరు స్వతంత్ర, రెబల్ అభ్యర్థులకు అదే గుర్తు ఇవ్వడం గమనార్హం. జనసేన అభ్యర్ధులు పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విజయనగరం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న మీసాల గీతకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం జరిగింది. మరోవైపు.. కాకినాడ జిల్లా జగ్గంపేట ఇండిపెండెంట్ అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్రకు కూడా ఇదే గుర్తు ఇవ్వడం జరిగింది. మరోవైపు.. ఇదే గుర్తు గాజు గ్లాసు గుర్తు కోసం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడిన పరిస్థితి. దీంతో ముగ్గురు అభ్యర్థుల సమక్షంలో డ్రా తీసిన ఆర్వో.. చివరికి సూర్యచంద్రరావును ఈ గుర్తు వరించింది. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు ఆర్వో నివేదించారు. కలెక్టర్ ఉత్తర్వులు అందిన తర్వాత గాజుగ్లాసు గుర్తును సూర్యచంద్రకు అధికారికంగా కేటాయిస్తామని ఆర్వో చెబుతున్నారు.

Read Latest Andhra pradesh News

Updated Date - Apr 29 , 2024 | 06:47 PM