Share News

కాయ్‌ రాజా కాయ్‌

ABN , Publish Date - May 30 , 2024 | 03:45 PM

లోక్‌సభ సార్వత్రక ఎన్నికలు జూన్‌1న ఏడో దశతో ముగియనున్నాయి.

కాయ్‌ రాజా కాయ్‌

  • ఎన్నికల ఫలితాలపై జోరుగా పందేలు

  • రూ.లక్షకు రూ.5 లక్షల బెట్టింగ్‌

  • మరికొందరు గోవా ట్రిప్‌నకు ఆఫర్‌

  • విందులు, వినోదాలు ఇస్తామని చాలెంజ్‌

  • ఎంపీ స్థానాల నుంచి ఏపీ అసెంబ్లీ వరకు ఇదే తీరు

  • నేతల నుంచి నుంచి వ్యాపారస్తుల దాకా ఆత్రుత

  • కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులపైనే అధిక మొత్తం

  • ఏపీ ఫలితాలపై నగరంలో చర్చ, ఉత్కంఠ

హైదరాబాద్‌ సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ సార్వత్రక ఎన్నికలు జూన్‌1న ఏడో దశతో ముగియనున్నాయి. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరిగాయి. 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఏ పార్టీ గెలుస్తుందో.. ఏ అభ్యర్థి విజేత అవుతారోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. దీంతో ఫలానా వారు గెలుస్తారు అంటే కాదు ఫలానా వారు గెలుస్తారు అంటూ బెట్టింగ్‌లు మొదలయ్యాయి. ఎంపీ స్థానాలపై కొందరు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పార్టీపై మరికొందరు తమతమ స్థాయిలనుబట్టి చాలెంజ్‌లు చేసుకుంటున్నారు. వీరిలో రాజకీయ నాయకులు, వ్యాపారులు కూడా ఉన్నారు. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో సికింద్రాబాద్‌, మల్కాజిగిరిలో గెలిచే అభ్యర్థులెవరు అనే దానిపై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ఈ రెండేకాదు.. రాష్ట్రంలోని పలు ఎంపీ స్థానాలతోపాటు కేంద్రంలో అధికారంలోకి ఎన్డీయే కూటమి వస్తుందా.. లేకుంటే ‘ఇండియా’ కూటమి వస్తుందా అనే దానిపై కూడా బెట్టింగ్‌లు కడుతున్నారు. కాయ్‌ రాజా.. కాయ్‌ అంటూ తమతమ స్థోమతనుబట్టి వేలు, లక్షల్లో డబ్బులు పందెం కాయడమేకాక స్నేహితులతో విందు పార్టీలకు, విహార యాత్రలకు సై అంటున్నారు.

మెదక్‌, చేవెళ్లపై కూడా..

మెదక్‌, చేవెళ్ల లోక్‌సభ స్థానాలపై కూడా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. మెదక్‌ స్థానంలో మాజీ కలెక్టర్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి గెలుపు, ఓటములపై రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులు, ఉద్యోగులు పెద్దఎత్తున బెట్టింగ్‌లకు దిగినట్లు తెలిసింది. అయితే ఓడిపోతున్నాడనే దానిపైనే ఎక్కువమంది పందెం వేసినట్లు తెలిసింది. దాంతో గెలుస్తాడనేవారిలో ఒకరిద్దరు విరమించుకున్నట్లు సమాచారం.

ఏపీ ఫలితాలపై

ఏపీలో రాబోవు ఫలితాలపై మిశ్రమ స్పందన వస్తుండగా ప్రధాన పార్టీల నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దాంతో ఏపీలో అధికారంలోకి వచ్చేదెవరు అనే దానిపై అక్కడ ఓటేసి వచ్చిన నగరవాసులు కొందరు భారీగా చాలెంజ్‌లు విసురుకుంటున్నారు. కేపీహెచ్‌బీలో ఓ హోటల్‌ నిర్వాహకుడు కూటమియే అధికారంలోకి వస్తుందంటూ రూ.5లక్షలు బెట్టింగ్‌ కాసినట్లు సమాచారం. ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సైతం చంద్రబాబే సీఎం అవుతాడంటూ రూ.3లక్షల వరకు బెట్టింగ్‌ కాసినట్లు తెలిసింది. మరో ఉద్యోగి ఏకంగా తమ టీమ్‌ సభ్యులు 12మందికి గోవా ట్రిప్‌ ఖర్చులు మొత్తం తానే భరిస్తానని ముందుకొచ్చిన్నట్లు.. ఇలా వీకెండ్‌ పబ్‌ పార్టీలకు, విందులు, వినోదాలు, విహార యాత్రలపై స్నేహితుల మధ్య పెద్దఎత్తున బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ఓటేసి వచ్చినవారు సొంత ఊరిలో.. నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలపై ఆరా తీసి మరీ బెట్టింగ్‌లకు దిగుతున్నట్లు తెలిసింది.

బుకీల ఎంట్రీ... రెట్టింపు సొమ్ము ఆఫర్‌

సాధారణంగా ఐ 20, టీ 20, వరల్డ్‌కప్‌ వంటి క్రికెట్‌ మ్యాచ్‌లకు ఎవరు గెలుస్తరనేదానిపై బుకీలు కాయ్‌ రాజా.. కాయ్‌ అంటుండగా, ఎంపీ ఎన్నికల ఫలితాలలో కూడా బుకీలు ఎంట్రీ ఇచ్చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వంపై రాజకీయ నాయకుల నుంచి వ్యాపారస్తుల వరకు వారు బెట్‌ కడుతున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందా.. లేకుంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందాఅనే దాంతోపాటు కాబోయే ప్రధాని మోదీనా, రాహుల్‌ గాంధీనా అని కూడా బుకీలు బెట్టింగ్‌లు కాస్తున్నారు. మోదీ మళ్లీ ప్రధాని అవుతారనే దానిపై పెట్టిన మొత్తానికి ఐదు రెట్లు ఇస్తామంటుండగా, రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారనే దానిపై పెట్టిన మొత్తానికి ఏడు నుంచి పది రెట్ల వరకు ఇస్తామంటూ బుకీలు ఆఫర్‌ చేస్తున్నారు. ఓ బుకీ అయితే ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని పెట్టినవారికి డబుల్‌ చెల్లిస్తామని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని పందెం కాస్తే మూడురెట్లు చెల్లింపులు చేస్తామని ఆఫర్‌ ప్రకటించినట్లు తెలిసింది. పబ్‌లు, హోటల్స్‌, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లలోని పరిచయస్తుల ద్వారా ఈ బెట్టింగ్‌ ప్రక్రియ సాగిస్తున్నట్లు సమాచారం.

Updated Date - May 30 , 2024 | 03:52 PM