Share News

ఢీ అంటే ఢీ

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:26 PM

హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంపై బీజేపీ దృష్టి సారించింది.

ఢీ అంటే ఢీ

  • మజ్లిస్‌తో అమీతుమీనే

  • ‘హైదరాబాద్‌’పై బీజేపీ ప్రత్యేక నజర్‌

  • గెలిచి తీరాలని అధిష్ఠానం పట్దుదల

  • అభ్యర్థి ఎంపికలోనే ఆచితూచి అడుగు

  • నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న మాధవీలత

  • ప్రచారంలోకి పార్టీ అగ్రనేతలు

  • రేపు చార్మినార్‌ నుంచి అమిత్‌షా రోడ్‌షో

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంపై బీజేపీ దృష్టి సారించింది. ఏ ఎన్నికల్లోనూ పెద్దగా పట్టించుకోని పార్టీ ఈసారి మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. అగ్రనేతలు, కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి వస్తున్నారు. మజ్లి్‌సకు కంచుకోటగా నిలిచిన హైదరాబాద్‌ సెగ్మెంట్‌లో పాగా వేయాలనే లక్ష్యంతో వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగా కొంత కాలంగా ఇక్కడ సేవా, ఆధ్యాత్మికంగా, ధార్మిక కార్యక్రమాలను చేపడుతున్న విరించి హాస్పిటల్స్‌ చైర్‌పర్సన్‌, లతమా ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ మాధవీలత కొంపెల్లకు టికెట్‌ కేటాయించారు. అత్యధికంగా మైనార్టీ ఓట్లు ఉన్న ఇక్కడ బీజేపీ విజయం సాధించడం కష్టం.. గత పది పార్లమెంట్‌ ఎన్నికల్లో వరుసగా విజయం సాధిస్తున్న మజ్లి్‌సను ఢీకొట్టడం సహాసమే. అయినప్పటికీ ఇక్కడ గెలుస్తామానే ధీమాతో బీజేపీ అభ్యర్థి అడుగులు వేస్తున్నారు. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఎక్కువ సార్లు దాదాపు రెండు లక్షల మెజార్టీతో ఇక్కడ విజయం సాధించారు. ఇలాంటి పరిస్థితిల్లో మరొకరు ఇక్కడ విజయం సాధించడం అంత సులువు అవుతుందా? అనేది ప్రశ్నార్థకమే. మరో వైపు మజ్లి్‌సకు బద్ద శత్రువు అయినా ఎంబీటీ కూడా బరిలో నిలువలేదు.


అగ్రనేతల ప్రచారం కలిసొచ్చేనా?

మాధవీలత నామినేషన్‌ దాఖలకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హాజరయ్యారు. ఆమెకు మద్దతుగా బేగంబజార్‌లో నిర్వహించిన ప్రచారంలో రాజస్థాన్‌ రాష్ట్ర మంత్రి రాజ్‌వర్థన్‌సింగ్‌ రాథోడ్‌ పాల్గొన్నారు. రేపు చార్మినార్‌ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్డు షోలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొంటున్నారు. ఇంత వరకు హైదరాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రులు పెద్దగా పాల్గొన్నది లేదు. ఈ సారి అగ్రనేతలు హైదరాబాద్‌కు వస్తుండడంతో చాలా ఉత్కంఠ నెలకొంది. అమిత్‌షా రోడ్డు షోను విజయవంతం చేయడానికి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి సమాయుత్తం చేశారు. అటు అభ్యర్థి, ఇటు అగ్రనేతలు హైదరాబాద్‌ ఎన్నికను సవాల్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.


ప్రచారంలో జోరు పెంచిన మాధవీలత

బీజేపీ మొదటి జాబితాలోనే ఆమే పేరును ప్రకటించడంతో మాధవీలత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మినహా దాదాపు అందరు సీనియర్‌ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. నామినేషన్‌ను దాఖలు చేయడానికి ముందు నామినేషన్‌ పత్రాలను భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ఉంచి మాధవీలత ప్రత్యేక పూజలు నిర్వహించారు. చార్మినార్‌ నుంచి బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలసి బ్యాండ్‌ మేళాలతో ఆమె అట్టహాసంగా బయల్దేరి వెళ్లారు. బోగసు ఓట్లు, పోలింగ్‌ బూత్‌ల్లో పోలింగ్‌ రోజు మజ్లిస్‌ అక్రమాలు పాల్పడుతుందని, వాటిని అడ్డుకుంటే ఇక్కడ విజయం సాధించడం సులువని ఆమె స్పష్టం చేస్తోంది. అలాగే మజ్లిస్‌ హాయంలో హైదరాబాద్‌ ఏం అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తోంది. పాతబస్తీలో మజ్లిస్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కేంద్రం సంక్షేమ పథకాల ప్రచారాన్ని చేస్తున్నారు. త్రీపుల్‌ తలాక్‌, మైనార్టీ వర్గాల కోసం ప్రధాని చేపట్టిన పథకాలు, విద్యార్థులకు స్కాలర్‌ షిప్స్‌, యువత ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలపై ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.


పెరిగిన ఓటు బ్యాంక్‌తో ఆశలు

పాతబస్తీ అంటే అక్కడ మజ్లి్‌సదే హవా. ఈ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి మినాహా మిగితా అన్ని చోట్ల మజ్లిస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. గోషామహల్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ గెలిచారు. మజ్లిస్‌ గెలిచిన నియోజకవర్గాల్లోనూ బీజేపీకి ఓటు బ్యాంక్‌ పెరిగింది. 2018 ఎన్నికలతో పోలిస్తే 2023 నాటికి 22,775 ఓట్లు పెరిగాయి. 2018 ఎన్నికలో 1,30,222 ఓట్లు రాగా, 2023లో 1,52,997 ఓట్లు వచ్చాయి. చార్మినార్‌లో 5,037, చంద్రాయణగుట్టలో 1,336, యాకుత్‌పురాలో 5,746, మలక్‌పేటలో 2,851, కార్వాన్‌లో 3,985, బహుదూర్‌పురాలో 4,222 ఓట్ల చొప్పున పెరిగాయి. అయితే నాంపల్లిలో మాత్రం 406 ఓట్లు తగ్గాయి. దీంతో హైదరాబాద్‌ స్థానంలో కాస్తా కష్టపడితే పార్లమెంట్‌లో ఎక్కువ స్థాయిలో ఓటు బ్యాంక్‌ను పెంచుకోవచ్చునని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - May 01 , 2024 | 10:43 AM