కంటి నిండా కునుకుండట్లే..!!
ABN , Publish Date - Mar 16 , 2024 | 04:50 AM
మారుతున్న జీవన విధానాలు, పెరుగుతున్న సమస్యలు మనిషికి కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నాయి. తగినంత నిద్ర లేకపోవడం అనేది శరీరంపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. అనేక శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతుంది. ఈ నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య దేశంలో నానాటికి
![కంటి నిండా కునుకుండట్లే..!!](https://media.andhrajyothy.com/media/2024/20240313/1sleep_16a64d4197.jpg)
దేశంలో పెరుగుతున్న నిద్రలేమి సమస్య
తగినంత నిద్రపోయేది 27ు మందే
పని ఒత్తిడే నిద్రలేమికి ప్రధాన కారణం
రెస్మెడ్ స్లీప్ సర్వేలో వెల్లడి
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మారుతున్న జీవన విధానాలు, పెరుగుతున్న సమస్యలు మనిషికి కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నాయి. తగినంత నిద్ర లేకపోవడం అనేది శరీరంపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. అనేక శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతుంది. ఈ నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య దేశంలో నానాటికి అధికమవుతోంది. మన దేశంలో కేవలం 27 శాతం మంది మాత్రమే ప్రతి రోజు రాత్రి వేళ సరిపడా (కనీసం 6 నుంచి 8 గంటలు) నిద్రపోతున్నారు. ప్రపంచ నిద్రా దినోత్సవం సందర్భంగా రెస్మెడ్ సంస్థ శుక్రవారం విడుదల చేసిన రెస్మెడ్ స్లీప్ సర్వే-2024లో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 36వేల మందిపై ఈ సర్వే చేశారు. ఇదే సంస్థ 2023లో నిర్వహించిన సర్వేలో సుమారు 80 శాతం మంది తగినంత నిద్రపోతున్నట్లు తేలింది. తాజా గణాంకాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండడం దేశంలో నిద్రలేమి సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. కాగా, పని ఒత్తిడి వల్లే తమకు నిద్ర ఉండడం లేదని సర్వేలో పాల్గొన్నవారిలో 42 శాతం మంది వెల్లడించడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల్లో 38 శాతం మంది పని ఒత్తిడి వల్ల రాత్రిళ్లు తగినంత సేపు నిద్రపోవడం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది 42 శాతంగా ఉంది. నిద్రలేమి వల్ల పని ప్రదేశంలో పూర్తి సామర్థ్యం మేరకు పని చేయలేకపోతున్నామని సర్వేలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది చెప్పారు. కాగా, రాత్రి మంచం ఎక్కిన తర్వాత సెల్ఫోన్ చూడడమనేది చాలా మందికి అలవాటుగా మారిందని, నిద్రలేమికి ఇది ప్రధాన కారణమని భావిస్తున్నారు.