మేం భారత్కు తిరిగి వచ్చేస్తాం!
ABN , Publish Date - May 20 , 2024 | 04:20 AM
విదేశీ విద్యార్థులే లక్ష్యంగా కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలతో భారతీయులు వణికిపోతున్నారు.
![మేం భారత్కు తిరిగి వచ్చేస్తాం!](https://media.andhrajyothy.com/media/2024/20240511/dfklbj_9558104d1d.jpg)
కిర్గిస్థాన్లో చిక్కుకున్న విద్యార్థుల వేడుకోలు
పుణె/హైదరాబాద్, పెందుర్తి, మే 19: విదేశీ విద్యార్థులే లక్ష్యంగా కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలతో భారతీయులు వణికిపోతున్నారు. హాస్టల్ గదులు వదిలి బయటకు రావడం లేదు. అక్కడి విద్యా సంస్థలు పరీక్షలను వాయిదా వేశాయి. చాలా మంది భారత్కు తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని భారత విద్యార్థులు వాపోతున్నారు. ‘బిష్కెక్లోని యూనివర్సిటీ హాస్టల్ నుంచి నన్ను, మరికొంత మంది విద్యార్థులను 30 కిలోమీటర్ల దూరంలోని ప్రైవేటు వసతి గృహానికి తరలించారు’ అని తెలంగాణలోని నల్లగొండకు చెందిన ఓ విద్యార్థిని ఫోన్లో తెలిపారు. యూనివర్సిటీలో భద్రత ఉన్నప్పటికీ బిష్కెక్లో విద్వేషాలు పెరిగిపోవడంతో తీవ్ర భయాందోళనకు గురైనట్లు చెప్పారు. ఏపీ, విశాఖపట్నంలోని పెందుర్తి ప్రాంతానికి చెందిన పది మంది వైద్య విద్యార్థులు కూడా బిష్కెక్లో ఇరుక్కుపోయారు. వారం రోజుల్లోగా కళాశాలకు సెలవులనగా అల్లర్లు చోటు చేసుకోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక, శుక్రవారం రాత్రి తాను ఉంటున్న ప్రాంతానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఓ హాస్టల్పై స్థానికులు దాడి చేశారని మహారాష్ట్రలోని బీడ్కు చెందిన ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి వెల్లడించారు. హింసాత్మక ఘటనల వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయని, భయానక పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. అదే కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఇండోర్ విదార్థి స్పందిస్తూ.. తమ హాస్టల్లో లైట్లు ఆపేసి 24 గంటలుపైగా అవుతోందని చెప్పారు. చాలా మంది అల్పాహారం చేసేందుకు క్యాంటీన్కు కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని, కాలేజీ సిబ్బందే తమ గదులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారని వివరించారు.