Share News

గుండె, ప్రాణం,రక్తం పణంగా పెట్టయినా రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం

ABN , Publish Date - May 29 , 2024 | 03:33 AM

భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామని, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు.

గుండె, ప్రాణం,రక్తం పణంగా పెట్టయినా రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం

రిజర్వేషన్లపై 50ు పరిమితి ఎత్తేస్తాం: రాహుల్‌ గాంధీ

ఈసారి ప్రధానిగా మోదీ ఉండరని వారాణసీలో వ్యాఖ్య

వారాణసీ, మే 28 : భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామని, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ‘‘‘దిల్‌(గుండె), జాన్‌(ప్రాణం), కూన్‌(నెత్తురు ) ఫణం పెట్టయినా రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్‌ 4 తర్వాత ప్రధానిగా మోదీ ఉండబోరని జోస్యం పలికారు. చివరి విడత పోలింగ్‌ జరిగే మోదీ నియోజకవర్గం వారణాసీ, బాన్స్‌గావ్‌ సహా యూపీలోని పలు నియోజకవర్గాల్లో మంగళవారం జరిగిన ప్రచారసభల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ‘‘రెండు భావాల మధ్య యుద్ధంగా సార్వత్రిక ఎన్నికలు సాగుతున్నాయి. రాజ్యాంగ పరిరక్షణ కోసం ‘ఇండియా కూటమి’, రాజ్యాంగ వినాశనం కోసం ఎన్డీయే పరస్పరం తలపడుతున్నాయి’’ అని రాహుల్‌ వివరించారు. రాజ్యాంగ గ్రంథం, అంబేడ్కర్‌, గాంధీల ఫొటోలను ఆయన సభలో ప్రదర్శిస్తూ మాట్లాడారు. ‘దళితులకు రాజ్యాంగంలో అంబేడ్కర్‌ ఆత్మగౌరవాన్ని అందించారు.

అందువల్లే ఆయన రచించిన రాజ్యాంగ భాగాలను తొలగించాలని బీజేపీ చూస్తోంది. కానీ, బీజేపీని ఈ ప్రయత్నంలో సఫలం కానీయబోం. అంబేడ్కర్‌, నెహ్రూ ఆలోచనలతో నిండిన రాజ్యాంగాన్ని నాశనం చేసే సాహసం ఏ శక్తీ చేయలేదు’’ అని రాహుల్‌ హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఏ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేసిందని రాహుల్‌ తెలిపారు. మధ్యప్రదేశ్‌, చత్తీ్‌సగఢ్‌లో గతంలో ఇదే చేశామని, ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశమంతా ఈ విధానాన్నే అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా, ‘నేను దేవుని ప్రతినిధిని’ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. పేదల రక్షణకు కాకుండా, అదానీ, అంబానీల కోసం మోదీని దేవుడు భూమిపైకి పంపించారని ఎద్దేవా చేశారు. ‘ఈయనేం దేవుడు? మోదీ కోసమే ఈ దేవుడు ఉన్నాడు’ అని వ్యాఖ్యానించారు. జూన్‌ నాలుగు తర్వాత ప్రధానిగా మోదీ ఉండబోరని గ్యారంటీగా చెప్పగలనని వారాణసీలో జరిగిన ప్రచార సభలో రాహుల్‌ అన్నారు. అందువల్ల వారాణసీలో జరుగుతున్నది ప్రధానమంత్రి అభ్యర్థికి, కాంగ్రెస్‌ అభ్యర్థికి మధ్య ఎన్నికలు కానేకాదని తెలిపారు.

Updated Date - May 29 , 2024 | 03:33 AM