Share News

బీజేపీని ఓడిస్తాం.. గెలుపు మాదే

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:22 AM

ప్రపంచంలోనే అతి పెద్ద వాషింగ్‌ మెషీన్‌ను బీజేపీ నడుపుతోందని, దేశంలోని అత్యధిక అవినీతిపరులు ఇప్పుడు మోదీ వెంటే ఉన్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.

బీజేపీని ఓడిస్తాం.. గెలుపు మాదే

అత్యధిక అవినీతిపరులు మోదీ వెంటే ఉన్నారు: రాహుల్‌ గాంధీ

తెలంగాణ తుక్కుగూడ సభలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అతి పెద్ద వాషింగ్‌ మెషీన్‌ను బీజేపీ నడుపుతోందని, దేశంలోని అత్యధిక అవినీతిపరులు ఇప్పుడు మోదీ వెంటే ఉన్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. తెలంగాణలోని తుక్కుగూడలో శనివారం నిర్వహించిన జన జాతర సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, కాంగ్రెస్‌ మేనిఫెస్టో (గ్యారంటీ కార్డు)ను విడుదల చేశారు. పార్టీ మేనిఫెస్టోను విప్లవాత్మకంగా రాహుల్‌ అభివర్ణించారు. దాని అమలుతో దేశ ముఖచిత్రమే మారిపోతుందన్నారు. ‘‘ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్‌ బాండ్లు. ‘పైసలు ఇచ్చుకోండి.. దందాలు చేసుకోండి’ అన్నది దాని నినాదం. వ్యాపారులందరినీ దానిని అడ్డు పెట్టి బెదిరించారు’’ అని ఆరోపించారు. మీడి యా, ధనబలం, నిఘా సంస్థలు, ఇంటెలిజెన్స్‌, ఈడీ, సీబీఐ మోదీ వెంట ఉన్నాయని, తమవెంట వాస్తవాలు, ప్రజల ప్రేమ ఉందని, అంతిమంగా విజయం న్యాయానిదే అవుతుందని వ్యాఖ్యానించారు. ‘‘ఐదు గ్యారంటీలతో మేనిఫెస్టో ఉంది. దేశంలో నిరుద్యోగులందరికీ ఏడాది పాటు రూ.లక్ష జీతం వచ్చేలా అప్రెంటిస్‌ శిక్షణ కోసం చట్టాన్ని తెస్తాం. ఉపాధి హామీ పథకంలో ఉపాధికి గ్యారంటీ ఇచ్చినట్లుగానే ఈ చట్టంతో ప్రతి యువకుడికి ఏడాదిపాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంతోపాటు వైద్య, విద్య రంగంలో శిక్షణ ఇస్తాం’’ అని వివరించారు. నారీ న్యాయ్‌ చట్టాన్ని తీసుకురానున్నామని, దీని కింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలను వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని ప్రకటించారు. మత్స్యకారుల కోసం డీజిల్‌ సబ్సిడీతో పాటు సహకార బ్యాంకును ఏర్పాటు చేస్తామని తెలిపారు. కిసాన్‌ న్యాయ్‌ కింద రుణమాఫీ చేస్తామని, రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర లభించేలా చట్టబద్ధత కల్పిస్తామన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన చేపడతామని ప్రకటించారు. కుల గణన తర్వాత ఆర్థిక గణన చేస్తామన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 03:22 AM