Share News

మాల్దీవులు వద్దు.. లక్షద్వీప్‌ ఉందిగా..

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:51 AM

ఇజ్రాయెల్‌ పౌరులను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తామని మాల్దీవులు ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ మాల్దీవుల పర్యటనకు వెళ్లొద్దని దానికి బదులుగా భారత్‌లోని లక్షద్వీ్‌పను సందర్శించాలని తమ దేశ ప్రజలను కోరింది. ఈ నిర్ణయాన్ని భారత్‌లో ఇజ్రాయెల్‌ కాన్సుల్‌ జనరల్‌ కోబీ షోషాని స్వాగతించారు.

మాల్దీవులు వద్దు..  లక్షద్వీప్‌ ఉందిగా..

  • ఇక్కడి అందమైన బీచ్‌లు సందర్శించండి

  • తమ దేశ పౌరులకు ఇజ్రాయెల్‌ పిలుపు

  • మాల్దీవుల నిషేధం ప్రకటనతో నిర్ణయం

న్యూఢిల్లీ, జూన్‌ 3: ఇజ్రాయెల్‌ పౌరులను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తామని మాల్దీవులు ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ మాల్దీవుల పర్యటనకు వెళ్లొద్దని దానికి బదులుగా భారత్‌లోని లక్షద్వీ్‌పను సందర్శించాలని తమ దేశ ప్రజలను కోరింది.

ఈ నిర్ణయాన్ని భారత్‌లో ఇజ్రాయెల్‌ కాన్సుల్‌ జనరల్‌ కోబీ షోషాని స్వాగతించారు. మాల్దీవుల్లో ఇజ్రాయేలీయులపై విధించే నిషేధం వారిని లక్షద్వీప్‌ బీచ్‌లను సందర్శించేలా ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. ‘‘మాల్దీవుల ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇజ్రాయేలీయులు ఇప్పుడు లక్షద్వీప్‌ అందమైన బీచ్‌లను సందర్శించవచ్చు’’ అని షోషాని ఎక్స్‌ (ట్విటర్‌)లో ట్వీట్‌ చేశారు. లక్షద్వీప్‌ అందించే ప్రశాంతతను చూడాలని ప్రజలను ప్రోత్సహిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరి 4న చేసిన ట్వీట్‌ను కూడా షోషాని మళ్లీ షేర్‌ చేశారు.

ఈ నేపథ్యంలో భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం లక్షద్వీ్‌పలోని అందమైన బీచ్‌ల చిత్రాలను ఎక్స్‌లో షేర్‌ చేసింది. ‘మాల్దీవులు ఇకపై ఇజ్రాయెల్‌ పౌరులను స్వాగతించడం లేదు కాబట్టి.. ఇక్కడ కొన్ని అందమైన, అద్భుతమైన భారత్‌ బీచ్‌లు ఉన్నాయి. ఇజ్రాయెల్‌ పర్యాటకులను ఇక్కడ ఆప్యాయంగా స్వాగతిస్తారు. మంచి ఆతిథ్యం ఇస్తారు’ అని ట్వీట్‌ చేసింది.


ఈ ఏడాది ఆరంభంలో మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు భారత్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది. దీంతో ‘బాయ్‌కాట్‌మాల్దీవులు’ పేరిట సోషల్‌ మీడియాలో భారత్‌ నుంచి పెద్దఎత్తున నిరసన మొదలైంది. కాగా.. గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడుల నేపథ్యంలో పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెలీయులను తమ దేశంలో పర్యటించకుండా నిషేధించాలని మాల్దీవులు ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ కూడా తమ దేశ పౌరులెవరూ మాల్దీవులకు వెళ్లొద్దని పిలుపునిచ్చింది.

Updated Date - Jun 04 , 2024 | 03:51 AM