ఈసీల నియామకాలపై రేపు సుప్రీం అత్యవసర విచారణ
ABN , Publish Date - Mar 14 , 2024 | 05:53 AM
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
![ఈసీల నియామకాలపై రేపు సుప్రీం అత్యవసర విచారణ](https://media.andhrajyothy.com/media/2024/20240313/gg_a5f5a20f2a.jpg)
న్యూఢిల్లీ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల మరో కమిషనర్ అరుణ్ గోయెల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే ఉన్నారు. దీంతో ఈనెల 15లోగా ఎన్నికల కమిషనర్ల పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషనర్ల నియామకాల ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈనెల 15న అత్యవసర విచారణకు అంగీకరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.