Share News

టార్గెట్‌ 400

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:59 AM

లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల ఘనవిజయం సాధించిన బీజేపీ..

టార్గెట్‌ 400

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ లక్ష్యమిదే!

2019లో ఓడిన 164 సీట్లపై గురి

జాతీయ ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా వ్యూహాత్మక చర్చలు

న్యూఢిల్లీ, జనవరి 10: లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల ఘనవిజయం సాధించిన బీజేపీ.. ఇక అసలు టార్గెట్‌పై గురిపెట్టింది. 543 స్థానాల లోక్‌సభలో ఈ దఫా 400 సీట్లు గెలవాలన్న బృహత్తర లక్ష్యం పెట్టుకుంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన, తక్కువ మెజారిటీతో గెలిచిన 164 లోక్‌సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. గత రెండేళ్లుగా కేంద్ర మంత్రులను, పార్టీ నేతలను ఆయా నియోజకవర్గాలకు పంపి ంచి.. క్షేత్ర స్థాయి వాస్తవాలను తెలుసుకుంది. పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం లేని చోట్ల విపక్ష ఎంపీలను, నాయకులను చేర్చుకోవడం ద్వారా బలపడాలని నిశ్చయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్‌డే నేతృత్వం వహిస్తారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, భూపేంద్ర యాదవ్‌, అశ్వినీ వైష్ణవ్‌, మన్‌సుఖ్‌ మాండవీయ కూడా పాల్గొన్నారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వర్చువల్‌గా హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కీలక బాధ్యతలను ప్రధాన కార్యదర్శులకు అప్పగించారు. ఎన్నికలకు పార్టీ తరఫున విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించే బాధ్యతను రాధామోహన్‌దాస్‌ అగర్వాల్‌కు అప్పగించారు. ఎన్నికల ప్రచారం, పబ్లిసిటీ సంబంధమైన అంశాలను సునీల్‌ బన్సల్‌, ఇతర ప్రధాన కార్యదర్శులు చూస్తారు. ప్రచార ప్రణాళికకు సంబంధించి కేంద్ర మంత్రులు, సీనియర్‌ నేతలు, రాష్ట్ర శాఖలతో సమన్వయం చేసుకునే బాధ్యతను కైలాస్‌ విజయవర్గీయ, బండి సంజయ్‌కుమార్‌, తరుణ్‌ చుగ్‌లకు కట్టబెట్టారు.

అధిక స్థానాల్లో బరిలోకి..

అత్యధిక స్థానాల్లో పోటీచేయడంతో పాటు 50ు ఓట్లు సాధించాలని బీజేపీ నాయకత్వం ఇంకో లక్ష్యం పెట్టుకుంది. గత ఎన్నికల్లో 543 స్థానాలకు గాను బీజేపీ 436 చోట్ల పోటీచేసింది. 303 స్థానాల్లో విజయం సాధించింది. కాగా, 1984 తర్వాత ఏ పార్టీ కూడా 400 మార్కును దాటలేదు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రధాని రాజీవ్‌గాంధీ సారథ్యంలో జరిగిన ఎన్నికల్లో సానుభూతి పవనాలు వీయడంతో కాంగ్రెస్‌ 514 సీట్లకు గాను 404 చోట్ల విజయం సాధించింది.

Updated Date - Jan 11 , 2024 | 03:59 AM