12 నుంచి రైలు ప్రయాణికులకూ స్విగ్గీ సేవలు
ABN , Publish Date - Mar 06 , 2024 | 03:31 AM
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ రైలు ప్రయాణికులకు కూడా తమ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

న్యూఢిల్లీ, మార్చి 5: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ రైలు ప్రయాణికులకు కూడా తమ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 12వ తేదీ నుంచి దక్షిణాదిలో తమ సేవలు అందించేందుకు సిద్ధమైంది. తొలివిడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నంతోపాటు కర్ణాటకలోని బెంగళూరు, ఒడిసాలోని భువనేశ్వర్ రైల్వేస్టేషన్లలో ఈ సేవలు ప్రారంభంకానున్నాయి. రాబోయే రోజుల్లో మరో 59 స్టేషన్లకు ఈ సేవలు విస్తరించనున్నట్టు స్విగ్గీ తెలిపింది. ఫుడ్ డెలివరీకి స్విగ్గీ, ఐఆర్సీటీసీ మధ్య మంగళవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రయాణికులు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఐఆర్సీటీసీ యాప్ను వినియోగించాల్సి ఉంటుంది. అందులో పీఎన్ఆర్ నంబర్ను ఎంటర్ చేసి.. తాము కోరుకున్న ఆహారాన్ని, కావాల్సిన స్టేషన్లో డెలివరీ తీసుకోవచ్చు.