రాజస్థాన్లో ముగ్గురు మహిళా టీచర్ల సస్పెన్షన్
ABN , Publish Date - Feb 25 , 2024 | 05:37 AM
రాజస్థాన్లో ముగ్గురు మహిళా టీచర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సరస్వతీ దేవిని అవమానపరిచి మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న కారణంతో ఒకరిపై, లవ్జిహాద్ను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలతో మరో ఇద్దరిపై ఈ
![రాజస్థాన్లో ముగ్గురు మహిళా టీచర్ల సస్పెన్షన్](https://media.andhrajyothy.com/media/2024/20240224/ff_42f65e4bab.jpg)
సరస్వతీ దేవి ఫొటో పెట్టనందుకు ఒకరిపై, లవ్ జిహాద్కు సహకరిస్తున్నారని మరో ఇద్దరిపై చర్యలు
జైపూర్, ఫిబ్రవరి 24: రాజస్థాన్లో ముగ్గురు మహిళా టీచర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సరస్వతీ దేవిని అవమానపరిచి మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న కారణంతో ఒకరిపై, లవ్జిహాద్ను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలతో మరో ఇద్దరిపై ఈ చర్యలు తీసుకొంది. మరో మహిళా టీచరుపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది. మతపర విద్వేషాలను రెచ్చగొట్టారంటూ బరన్ జిల్లా లక్డాయ్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభోదక్ (లెవల్-1)గా పనిచేస్తున్న హేమలత బైర్వాను అధికారులు సస్పెండ్ చేశారు. రిపబ్లిక్ డే రోజున పాఠశాలలో జెండా ఎగరవేసిన సందర్భంగా గాంఽధీ, అంబేడ్కర్ ఫొటోలు పెట్టారు. సరస్వతీ దేవి ఫొటో కూడా పెట్టాలని గ్రామస్థులు కోరగా హేమలత అంగీకరించలేదు. చదువులకు సరస్వతీ దేవి ఏమి చేశారని ఎదురు ప్రశ్న వేశారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదేశాలతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. లవ్ జిహాద్, ఇస్లామిక్ జిహాద్ను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణపై కోటా జిల్లా ఖజూరీ ఓడ్పూర్ గ్రామంలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలకు చెందిన ఇద్దరు మహిళా టీచర్లను మీర్జా ముజాహీద్, ఫిరోజ్ ఖాన్ను సస్పెండ్ చేయాలని కూడా మంత్రి ఆదేశించారు. సర్వ హిందూ సమాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. మరో టీచరు షబానాపై చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు చెప్పారు.