Share News

Stars in Lok Sabha : లోక్‌సభకు రామాయణ్‌ రాముడు.. రచన.. కంగన..

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:45 AM

లోక్‌సభ ఎన్నికల్లో తారలు తళుక్కుమన్నారు. రామానంద్‌ సాగర్‌ రామాయణ్‌లో శ్రీరాముడి పాత్రధారి, బాలీవుడ్‌ నటుడు అరుణ్‌ గోవిల్‌ తొలిసారిగా చట్టసభలో అడుగుపెట్టనున్నారు. యూపీలోని మేరఠ్‌ నుంచి

Stars in Lok Sabha : లోక్‌సభకు రామాయణ్‌ రాముడు.. రచన.. కంగన..

ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున మెరిసిన తారలు

న్యూఢిల్లీ, జూన్‌ 4: లోక్‌సభ ఎన్నికల్లో తారలు తళుక్కుమన్నారు. రామానంద్‌ సాగర్‌ రామాయణ్‌లో శ్రీరాముడి పాత్రధారి, బాలీవుడ్‌ నటుడు అరుణ్‌ గోవిల్‌ తొలిసారిగా చట్టసభలో అడుగుపెట్టనున్నారు. యూపీలోని మేరఠ్‌ నుంచి పోటీచేసిన ఆయన ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మపై 9,366 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ సినీనటి, తెలుగులో ‘కన్యాదానం’, ‘మావిడాకులు’, ‘నేను ప్రేమిస్తున్నాను’ వంటి చిత్రాల్లో నటించిన రచనా బెనర్జీ టీఎంసీ తరఫున విజయం సాధించారు. బెంగాల్‌లోని హూగ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె 74,048 ఆధిక్యాన్ని సాధించారు. బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ నుంచి టీఎంసీ నుంచే బరిలో నిలిచిన బెంగాలీ సినిమా, టీవీ నటి సయానీ ఘోష్‌ 2.50 లక్షల ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. ఇప్పటికే ఓసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ మలయాళీ నటుడు సురేశ్‌ గోపీ కేరళలోని త్రిషూర్‌లో విజయం సాధించి, లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి బీజేపీ నుంచి రేసులో నిలిచిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ 74,755 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన భోజ్‌పూరి నటుడు మనోజ్‌ తివారీ సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి కన్హయ్య కుమార్‌పై 1,22,135 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.

బెంగాల్‌లోని అసన్సోల్‌ స్థానం నుంచి పోటీ చేసిన సిటింగ్‌ ఎంపీ, ఈసారి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శతృఘ్న సిన్హా, బీజేపీ అభ్యర్థి సురేంద్రజీత్‌పై విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి హేమామాలిని యూపీలోని మథుర స్థానం నుంచి 2.91లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రముఖ నటుడు, యూపీలోని గోరఖ్‌పూర్‌ సిటింగ్‌ ఎంపీ, రేసుగుర్రం సినిమాలో ప్రతినాయకుడు రవికిషన్‌(రవీంద్ర శుక్లా).. ఎస్పీ అభ్యర్థి కాజల్‌ నిషాద్‌పై లక్ష పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. బెంగాల్‌లోని ఘటల్‌ నుంచి పోటీ చేసిన తృణమూల్‌ సిటింగ్‌ ఎంపీ, సినీనటుడు దీపక్‌ అధికారి బీజేపీ అభ్యర్థి హిరణ్మయి చటోపాధ్యాయపై 1.75 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే భోజ్‌పురీ నటుడు, నేపథ్య గాయకుడు పవన్‌ సింగ్‌కు బిహార్‌లోని కరాకట్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమిపాలయ్యారు. యూపీలోని ఆజంఘఢ్‌ నుంచి భోజ్‌పురీ నటుడు దినేశ్‌ లాల్‌ యాదవ్‌ ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్రయాదవ్‌ చేతిలో 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీవీ నటిగా, మోడల్‌గా గుర్తింపు పొంది రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్మృతీ ఇరానీ.. అమేఠీ నుంచి పోటీచేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో 1.62 లక్షల ఓట్లతో ఓడిపోయారు. తమిళనాడులోని విరుద్‌నగర్‌ నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన నటి రాధిక, అమరావతి నుంచి పోటీ చేసిన నవనీత్‌కౌర్‌ ఓడిపోయారు.

Updated Date - Jun 05 , 2024 | 04:45 AM