బీజేపీ-ఆరెస్సె్సతో విద్వేష వ్యాప్తి
ABN , Publish Date - Feb 12 , 2024 | 03:20 AM
బీజేపీ, ఆరెస్సెస్ విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయని, అయితే ప్రేమ అనేది ఈ దేశ డీఎన్ఏలోనే ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
![బీజేపీ-ఆరెస్సె్సతో విద్వేష వ్యాప్తి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ
రాజ్గఢ్, ఫిబ్రవరి 11: బీజేపీ, ఆరెస్సెస్ విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయని, అయితే ప్రేమ అనేది ఈ దేశ డీఎన్ఏలోనే ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రెండు రోజుల విరామం తర్వాత భారత్ జోడో న్యాయ్ యాత్ర ఛత్తీ్సగఢ్లో ఆదివారం పునఃప్రారంభమైంది. రాయ్గఢ్లోని కెవ్డాబాడీ చౌక్లో నిర్వహించిన సభలో రాహుల్ ప్రసంగించారు. భావితరాల కోసం ద్వేషం, హింస లేని హిందుస్థాన్ కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని చెప్పారు. ‘‘ప్రస్తుతం దేశం ప్రతి మూలలోనూ విద్వేషం, హింస వ్యాపిస్తున్నాయి. భాష ఆధారంగా, ప్రాంతం ఆధారంగా ఇతరులంటే ఇష్టం లేదని కొందరు చెబుతున్నారు. ఇలాంటి ఆలోచనలు దేశాన్ని బలహీనపరుస్తాయి. బీజేపీ, ఆరెస్సెస్ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నా కూడా దేశంలో వివిధ మతాలకు చెందిన, విభిన్న ఆలోచనలు కలిగిన ప్రజలు ప్రేమతో ప్రశాంతంగా కలసిమెలసి జీవిస్తున్నారు’’ అని రాహుల్ పేర్కొన్నారు. గతేడాది మే నెల నుంచి గృహదహనాలు, హత్యాకాండలతో అట్టుడుకుతున్న మణిపూర్ను ప్రధాని మోదీ ఒక్కసారి కూడా సందర్శించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. మణిపూర్ కాలి బూడిదైనా అక్కడ ప్రభుత్వ ఉనికే లేదన్నారు. సాయుధ దళాల్లో సైనికులను స్వల్ప కాలానికి నియమించే అగ్నివీర్ ప్రక్రియను రాహుల్ తప్పుబట్టారు. మిలటరీలోకి ఎంపికైనా రిక్రూట్ చేసుకోని 1.50 లక్షల మంది యువతకు నష్టపరిహారం చెల్లించడమో లేదా వారిని విధుల్లోకి తీసుకోవడమో జరిగే వరకూ కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. వీరందరికీ న్యాయం జరిగేలా తమ పార్టీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.