రాజ్యసభకు సోనియా నామినేషన్
ABN , Publish Date - Feb 15 , 2024 | 02:47 AM
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగారు. బుధవారం రాజస్థాన్ అసెంబ్లీ భవనంలో ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగారు. బుధవారం రాజస్థాన్ అసెంబ్లీ భవనంలో ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ సీఎం అశోక్ గహ్లోత్ పాల్గొన్నారు. లోక్సభకు ఇవే తన చివరి ఎన్నికలని 2019 ఎన్నికల్లో సోనియా ప్రకటించారు. దీంతో ఇమె ఇప్పుడు రాజ్యసభ బరిలో తొలిసారిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఈసారి రాయ్బరేలీ నుంచి లోక్సభకు ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ నుంచి రేణుకా చౌదరి, యువజన కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్, హిమాచల్ప్రదేశ్ నుంచి అభిషేక్ సింఘ్వీ రాజ్యసభకు పోటీ చేయనున్నారు. అలాగే, అజయ్ మాకెన్తోపాటు డాక్టర్ సయ్యద్ నసీర్ హుసేన్, జీసీ చంద్రశేఖర్ కర్ణాటక నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ రాజ్యసభకు పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒడిసా నుంచి రాజ్యసభ బరిలో నిలువనున్నారు. 56 రాజ్యసభ స్థానాలకు ఈనెల 27న ఎన్నికలు జరుగనున్నాయి.