Share News

‘మహాయుతి’ని గెలిపించింది మహిళలే

ABN , Publish Date - Nov 25 , 2024 | 03:22 AM

మహారాష్ట్రలో ‘మహాయుతి’ కూటమిని గెలిపించింది మహిళలేనని శరద్‌ పవార్‌ అన్నారు.

‘మహాయుతి’ని గెలిపించింది మహిళలే

కరాద్‌, నవంబరు 24: మహారాష్ట్రలో ‘మహాయుతి’ కూటమిని గెలిపించింది మహిళలేనని శరద్‌ పవార్‌ అన్నారు. మహిళలకు నేరుగా అర్థిక సాయం అందించే లడ్కీ బహిన్‌ పథకం, పెద్ద సంఖ్యలో మహిళలు ఓటింగ్‌లో పాల్గొనడం వల్లనే బీజేపీ కూటమి విజయం సాధించిందని అభిప్రాయపడ్డారు. మతపరమైన విభజన కూడా కొంత కారణమని చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణ ఫలితాలు ఎన్నడూ చూడలేదని అన్నారు. ఆదివారం కరాద్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ కూటమి బాగా కష్టపడిందని, ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయని చెప్పారు. దీనిపై పార్టీలో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఈవీఎంల కారణంగానే ఓడిపోయినట్టు వస్తున్న విమర్శలపై స్పందిస్తూ అధికారిక సమాచారం లేకుండా దీనిపై మాట్లాడబోనని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమిస్తారా అన్న ప్రశ్నకు జవాబిస్తూ దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కొత్త నాయకత్వాన్ని తయారు చేసి ప్రజల ముందుకు వెళ్తామని అన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 03:22 AM