మెగసెసే అవార్డును తిరిగిచ్చేసిన సందీప్ పాండే
ABN , Publish Date - Jan 03 , 2024 | 03:47 AM
తనకు బహూకరించిన రామన్ మెగసెసే అవార్డును ప్రముఖ సామాజిక కార్యకర్త సందీప్ పాండే మంగళవారం వాపసు చేశారు.
న్యూఢిల్లీ, జనవరి 2: తనకు బహూకరించిన రామన్ మెగసెసే అవార్డును ప్రముఖ సామాజిక కార్యకర్త సందీప్ పాండే మంగళవారం వాపసు చేశారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు అమెరికా మద్దతు తెలుపుతున్నందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకొన్నారు. అమెరికాకు చెందిన రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఈ అవార్డును నెలకొల్పింది. అమెరికాకే చెందిన ఫోర్డు ఫౌండేషన్ సహకారం అందించింది. 2002లో ఆయనకు బహూకరించిన ఈ అవార్డును తిప్పి పంపుతున్నట్టు ప్రకటించారు. అమెరికా యూనివర్సిటీలు ఇచ్చిన రెండు ఎం.ఎస్. డిగ్రీలను కూడా వాపసు చేస్తున్నట్టు తెలిపారు. 21,500 మందికిపైగా పాలస్తీనా పౌరులను హతమార్చిన ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఇవ్వడాన్ని తాను తట్టుకోలేకపోతున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీసుకువచ్చిన న్యాయ సంస్కరణలను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే.