Share News

ఒకే క్షిపణి.. వేర్వేరు లక్ష్యాల ఛేదన

ABN , Publish Date - Mar 12 , 2024 | 02:39 AM

మిషన్‌ దివ్యాస్త్ర’లో భారత్‌ కీలక మైలురాయిని చేరుకుంది. ఎంఐఆర్వీ సాంకేతికతతో.. 5 వేల నుంచి 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమవ్వడం యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

ఒకే క్షిపణి.. వేర్వేరు లక్ష్యాల ఛేదన

భారత్‌ అమ్ముల పొదిలో ఎంఐఆర్వీ టెక్నాలజీ

న్యూఢిల్లీ, మార్చి 11: ‘మిషన్‌ దివ్యాస్త్ర’లో భారత్‌ కీలక మైలురాయిని చేరుకుంది. ఎంఐఆర్వీ సాంకేతికతతో.. 5 వేల నుంచి 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమవ్వడం యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఎంఐఆర్వీ టెక్నాలజీ అంటే.. ఏకకాలంలో ఒకే క్షిపణి సాయంతో వేర్వేరు లక్ష్యాలను ఛేదించేలా బహుళ రీ-ఎంట్రీ వాహనాలను(వార్‌హెడ్‌లు) ప్రయోగించడం. ఇప్పటి వరకు ఎంఐఆర్వీ టెక్నాలజీ కలిగి ఉన్న దేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్‌, రష్యా, ఫ్రాన్స్‌, చైనా, పాకిస్థాన్‌ ఉన్నాయి. అగ్ని-5తో పరీక్షించిన ఎంఐఆర్వీ విజయవంతం అవ్వడంతో.. ఇప్పుడు వాటి సరసన భారత్‌ చేరింది. పాకిస్థాన్‌ 2017లో 2,200 కిమీ దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా ‘అబాబీల్‌’ మీడియం రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణిని ఈ టెక్నాలజీతో పరీక్షించింది. ఇంటర్మీడియట్‌ రేంజ్‌ క్షిపణి అయిన అగ్ని-5 ద్వారా భారత్‌ ఈ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. 5 వేల నుంచి 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అగ్ని-5 ఛేదించగలదు.

శత్రువుకు చిక్కదు.. దొరకదు..!

సాధారణంగా క్షిపణులను ఇంటర్‌సెప్ట్‌ చేసి, వాటిని గాల్లోనే ధ్వంసం చేసే సాంకేతికత చాలా దేశాలకు అందుబాటులో ఉంది. ఇటీవల హమాస్‌ దాడుల తర్వాత.. ఇజ్రాయెల్‌ ఐరన్‌డోమ్‌ వ్యవస్థ పతాక శీర్షికలకెక్కింది. అయితే.. ఎంఐఆర్వీ సాంకేతికతలో అలా ఇంటర్‌సెప్ట్‌ చేయడం దాదాపు అసాధ్యమే..! బాలిస్టిక్‌ క్షిపణులు లక్ష్యాన్ని చేరేముందు భూ వాతావరణాన్ని దాటి పైకి వెళ్తాయి. అవి లక్ష్యాన్ని చేరడానికి తిరిగి భూ వాతావరణంలోకి రావడాన్ని రీ-ఎంట్రీ అంటారు. భారత్‌ అభివృద్ధి చేసిన ఎంఐఆర్వీలో.. క్షిపణి ప్రయోగం జరిగాక.. టార్గెట్లను నిర్దేశించిన వార్‌హెడ్‌లు భూవాతావరణంలోకి ఒక్కసారి రీ-ఎంట్రీ అయితే.. వాటిని నిరోధించడం శత్రుదేశాలకు సాధ్యమయ్యే పనికాదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. భారత ఎంఐఆర్వీలో అన్ని వార్‌హెడ్లకు గైడెడ్‌, కంట్రోలింగ్‌, ప్రత్యేక ప్రోగ్రామింగ్‌ వ్యవస్థలున్నాయి. శత్రుదేశాల రాడార్లు వార్‌హెడ్లను గుర్తించి, దూసుకువస్తుంటే.. ప్రోగ్రామింగ్‌ వ్యవస్థలు వాటిని నిరోధిస్తాయి. ‘‘మన ఎంఐఆర్వీలకు కచ్చితత్వంతో దూసుకుపోయేలా సెన్సర్లున్నాయి. వార్‌హెడ్లు ఒక్కసారి రీ-ఎంట్రీ అయితే.. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తాయి. చైనా ఉత్తరభాగంతోపాటు.. ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు, ఆసియా మొత్తం అగ్ని-5 క్షిపణి పరిధిలో ఉంటుంది’’ అని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ఈ వార్‌హెడ్‌లు ఏకకాలంలో వేర్వేరు లక్ష్యాలను ఛేదిస్తాయి. ఇందుకోసం అగ్ని-5లో బహుళ వార్‌హెడ్‌లను అమర్చేందుకు వీలుంటుంది. న్యూక్లియర్‌ వార్‌హెడ్లను కూడా ఎంఐఆర్వీలో తరలించవచ్చు. మొదటగా అణ్వాయుధాలను వాడకూడదనే నిబంధనకు భారత్‌ కట్టుబడి ఉంది. కానీ, భారత్‌ ఒక్కసారి ఎంఐఆర్వీతో ఎదురుదాడి చేస్తే శత్రుదేశాలకు కోలుకోని దెబ్బ తప్పదు’’ అని డీఆర్‌డీవో మాజీ డైరెక్టర్‌ జనరల్‌, నీతి ఆయోగ్‌ శాస్త్ర సాంకేతిక విభాగం సభ్యుడు డాక్టర్‌ వీకే సారస్వత్‌ వెల్లడించారు.

వరుసగా క్షిపణుల ప్రయోగాలు?

భారత్‌ మరికొన్ని క్షిపణులను కూడా ప్రయోగించనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ కారణంగానే బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో నో ఫ్లైజోన్‌ను ప్రకటించింది. నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌(నోటమ్‌) ప్రకటన చేసింది. ఒక ప్రాంతాన్ని నోటమ్‌గా ప్రకటిస్తే.. ఏక్షణంలోనైనా క్షిపణి ప్రయోగాలు జరపవచ్చని దాని అర్థం. జలాంతర్గాముల ద్వారా ప్రయోగించడానికి రూపొందించిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన క్షిపణి కే-4ను పరీక్షించాలని భారత్‌ యోచిస్తోంది. ఈ క్షిపణి 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. బంగాళాఖాతం పరిధిలో తాజాగా జారీచేసిన నోటమ్‌ ఈ నెల 16 దాకా కొనసాగనుంది. నోటమ్‌ ఫ్లైజోన్‌ కూడా బంగాళాఖాతానికి దక్షిణాన 3,500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కే-4 క్షిపణి పరిధి కూడా 3,500 కిలోమీటర్లు.

క్షుణ్ణంగా పరిశీలిస్తున్న డ్రాగన్‌?

హిందూ మహాసముద్ర ప్రాంతంపై చైనా కొంతకాలంగా నిఘా పెంచింది. గత నెలలో శ్రీలంక సముద్ర తీరంలో తన పరిశోధనా నౌక(జియాన్‌ యాంగ్‌హాంగ్‌-3)ను ఉంచిన డ్రాగన్‌.. తాజాగా బంగాళాఖాతంలోనూ పరిశోధన నౌక జియాన్‌ యాంగ్‌హాంగ్‌-01ను మోహరించింది. నోటమ్‌ను ప్రకటించగానే చైనా నౌక విశాఖ సముద్ర తీరానికి 260 నాటికల్‌ మైళ్ల(సుమారు 480 కిలోమీటర్లు) దూరంలో లంగరు వేయడం గమనార్హం..! ఈ నెల 6న మలక్కా జలసంధి మీదుగా ప్రవేశించిన ఆ నౌక.. 8వ తేదీన నికోబార్‌ ద్వీపం, భారత ద్వీపకల్పం మధ్య కనిపించింది. ఉపరితల ధ్వని సంకేతాలను గుర్తించే సెన్సర్లు ఆ నౌకలో ఉన్నాయని భారత్‌ భావిస్తోంది. అంటే.. జలాంతర్గాములకు సంబంధించిన ధ్వనిని కూడా ఈ నౌక గ్రహించగలదు. భారత నౌకాదళం కూడా ఆ నౌక కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది.

Updated Date - Mar 12 , 2024 | 02:39 AM