మధ్య తరగతి సొంతింటి కల సాకారం!
ABN , Publish Date - Feb 02 , 2024 | 04:03 AM
దేశంలో మధ్యతరగతి వర్గాలు కోరుకునే సొంతింటి కలను సాకారం చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మధ్యతరగతి వర్గం కోసమే ప్రత్యేకంగా కొత్త హౌసింగ్ పథకాన్ని తెస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
![మధ్య తరగతి సొంతింటి కల సాకారం!](https://media.andhrajyothy.com/media/2023/20231205/2hhh_5771831987.jpg)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో మధ్యతరగతి వర్గాలు కోరుకునే సొంతింటి కలను సాకారం చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మధ్యతరగతి వర్గం కోసమే ప్రత్యేకంగా కొత్త హౌసింగ్ పథకాన్ని తెస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది పూర్తిగా అద్దె ఇళ్లలో ఉండేవారు, బస్తీల్లో నివసించేవారు, అనధికార కాలనీల్లో ఉండే మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ కొత్త పథకం దేశంలోని కోట్లాది మంది మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. ప్రసుత్తం అమల్లో ఉన్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ(పీఎంఏవైజీ) పథకం మరో ఐదేళ్లపాటు కొనసాగుతుందని తెలిపారు. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్టు తెలిపారు. మొత్తం 2 కోట్ల కుటుంబాలకు సొంత ఇళ్లు కల్పించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని కొనసాగిస్తున్నట్టు వివరించారు.